హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. 11 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. 11 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ఆదివారం ( డిసెంబర్ 14 ) హైదరాబాద్ లో అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తుండగా పట్టుకున్నారు మాసబ్ ట్యాంక్-నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ పోలీసులు.

నిందితుల దగ్గర నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉండగా.. శనివారం హైదరాబాద్ లో గంజాయి, హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. డ్రగ్స్ రవాణాలో కీలక నిందితుడితో సహా మరో ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. 

నిందితులనుంచి 5 కిలోల హాష్ ఆయిల్, 5 కిలోల గంజాయిని, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ  70 లక్షలు ఉంటుందని  పోలీసులు అంచనా వేశారు. HNEW టీం, టాస్క్ ఫోర్స్, లంగర్ హౌస్ పోలీసుల జాయింట్ ఆపరేషన్  లో శనివారం (డిసెంబర్13) ఈ అంతర్ రాష్ట్ర ముఠాను  పట్టుకున్నారు. 

ఈ కేసులో బాలాజీ అనే నిందితుడిని విచారించగా ప్రధాని నిందితుడు వైకుంఠరావు బాగోతం బయటికి వచ్చింది. 2019 నుంచి  వైకుంఠరావు డ్రగ్స్ రవాణా చేస్తున్నాడు. కారు డ్రైవర్ గా పనిచేస్తున్న వైకుంఠరావు.. ఒడిశానుంచి తక్కువ ధరకు డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ లో అమ్ముతున్నట్టు గుర్తించారు. గతంలో కూడా వైకుంఠరావుపై రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.