- రాత్రి 2 గంటలపాటు ఆపరేషన్ కవచ్ పేరిట పోలీసుల తనిఖీలు
బషీర్బాగ్/జూబ్లీహిల్స్, వెలుగు: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గురువారం రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు సిటీ పోలీసులు ఆపరేషన్ కవచ్ పేరిట ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాహనాల నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్పై ప్రధానంగా దృష్టి సారించారు. జూబ్లీహిల్స్ -వెంకటగిరి, మధురానగర్ -కృష్ణకాంత్ పార్క్, బోరబండ -పిలీ దర్గా, సనత్నగర్, అమీర్పేట్ -సత్యం థియేటర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్స్ ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ సందర్శించారు. వాహన తనిఖీలను పర్యవేక్షించారు.
స్వయంగా కొన్ని వాహనాలను ఆపి నంబర్ ప్లేట్లను పరిశీలించారు. నంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనదారులతో మాట్లాడి, నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో తెలియజేశారు. ఉద్దేశపూర్వకంగా రూల్స్అతిక్రమించేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఆపరేషన్లో భాగంగా నగరవ్యాప్తంగా మొత్తం 12,098 వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు 2,149 వాహనాలను సీజ్చేశారు. వీటిలో 2,046 బైక్లు, 52 ఫోర్ వీలర్స్, 51 ఆటోలు ఉన్నాయి. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వాహనాల నంబర్ ప్లేట్లను ఉద్దేశపూర్వకంగా మార్చడం లేదా అస్పష్టంగా ఉంచడం సమాజ భద్రతకు పెను ముప్పు అని పేర్కొన్నారు.
నేరాలు చేసేవాళ్లు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్లను వంచడం, అక్షరాలను చెరిపేయడం లేదా నకిలీ నంబర్లను వాడుతుంటారని తెలిపారు. దీనివల్ల అమాయక వాహనదారులకు తప్పుడు ఈ-–చలాన్లు వెళ్లడమే కాకుండా, కొన్నిసార్లు వారు క్లిష్టమైన కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్కు పాల్పడే వారిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏసీపీ క్రైమ్స్ శ్రీనివాసులు, ఏసీపీ లా అండ్ ఆర్డర్ తఫ్షీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ నార్త్ రేంజ్ శ్వేత, డీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ వెంకటేశ్వర్లు, డీసీపీ క్రైమ్స్ చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.
