- డీలర్లు కోరినంత సరఫరా చేస్తున్న ఆయిల్ కంపెనీలు
- మళ్లీ సాధారణ స్థితికి.. ఇప్పట్లో ధరలు పెంచేది లేదన్న కేంద్రం ప్రకటనతో ఊరట
హైదరాబాద్ సిటీ, వెలుగు: జంట నగరాల్లో వారం రోజులుగా వాహనదారులు పడుతున్న పెట్రోల్ కష్టాలు తీరాయి. పెట్రోల్ డీలర్లు కోరినంత ఇంధనాన్ని సరఫరా చేస్తుండడంతో బంకుల ఎదుట క్యూలు తగ్గాయి. నగరంలో1,200 మంది డీలర్లుండగా, రోజుకు10 నుంచి 11 లక్షల లీటర్ల పెట్రోల్, 6 నుంచి 7లక్షల డీజిల్కు డిమాండ్ ఉంటోంది.
కొద్ది రోజులుగా అడిగినంత సరఫరా చేయకపోవడం, కొరత ఉందన్న వదంతులతో వాహనదారులు ట్యాంక్ఫుల్చేసుకోవడంతో పెట్రో కష్టాలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా భారీ క్యూ లైన్లు కనిపించాయి. చాలామంది పెట్రోల్ను బాటిల్స్లో, డీజిల్ను క్యాన్లలో తీసుకువెళ్లారు. దీంతో కలెక్టర్ ప్రియాంక ఆల..ఆయిల్ కంపెనీలు, సివిల్సప్లయీస్డిపార్ట్మెంట్, డీలర్ల సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఇంధన కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దీంతో డీలర్లు, ఆయిల్ కంపెనీల మధ్య నెలకొన్న సందిగ్ధ పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం ఆయిల్కంపెనీలు డీలర్లు కోరినంత ఇంధనం ఇస్తుండడంతో సిటీలోని అన్ని పెట్రోల్బంకుల్లో సాధారణ పరిస్థితి నెలకొంది. దీంతో గురువారం ఒక్క రోజే నగరంలోని పెట్రోల్ బంకులకు 8 లక్షల లీటర్ల పెట్రోల్, 6 లక్షల లీటర్ల డీజిల్ను ఆయిల్ కంపెనీలు సరఫరా చేశాయి.
పెట్రోల్ ధరలు పెరుగుతాయన్న వార్తల్లో నిజం లేదని కేంద్రం ప్రకటించడంతో ఆయిల్కంపెనీలు డీలర్లు కోరినంత సరఫరా చేస్తున్నారు. అయితే, మరో వారం పది రోజుల్లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందని, తమకు స్పష్టమైన సమాచారం ఉందని కొందరు డీలర్లు అంటున్నారు.

