హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలో మంగళవారం నాలుగు చోట్ల ఆక్రమణలు తొలగించిన హైడ్రా, సుమారు రూ.1,511 కోట్ల విలువైన భూములను కాపాడింది. శేరిలింగంపల్లి మున్సిపల్ ఆఫీస్ మదీనాగూడ రోడ్డు కొండాపూర్లో భూమి విలువే రూ. 700 కోట్లు ఉంటుందని అంచనా. ఇక్కడ 4 ఎకరాల జంగంకుంటను పూడ్చేసి మట్టితో చదును చేసి ప్లాట్లుగా చేసి అమ్మేందుకు సిద్ధమైన కబ్జాదారుడికి చెక్ పెట్టింది.
రెవెన్యూ అధికారులతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి చెరువును ఆక్రమించినట్లు తేల్చారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం ఫెన్సింగ్ కూడా వేశారు. అలాగే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం అల్వాల్ కొత్త చెరువు 8 ఎకరాల మేర ఆక్రమించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యకలాపాలు నిర్వహిస్తూ చెరువును కలుషితం చేస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు వచ్చింది.
దీంతో హైడ్రా ఫీల్డ్లెవెల్లో పరిశీలించి షెడ్లను తొలగించింది. ఇక రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సాహేబ్నగర్ కలాన్లోని జక్కిడినగర్ కాలనీలో 650 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. సర్వే నంబరు 132, 133లో 1982లో 12 ఎకరాల మేర 161ప్లాట్లతో జక్కిడి కుటుంబ సభ్యులు లే ఔట్ వేశారు. ఇందులో 650 గజాలు పార్కు కోసం కేటాయించారు.
1985లో అమ్మేశారు. ఈ పార్కు స్థలంలో ఇప్పుడు ప్రహరీ, షెడ్లు నిర్మించడంతో హైడ్రా కూల్చేసి ఫెన్సింగ్ వేసింది. మల్కాజిగిరి జోన్, మౌలాలి సర్కిల్ పరిధిలోని కాకతీయ నగర్లో రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్కును కూడా హైడ్రా కాపాడింది.
మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి, వెంకటేశ్వర నగర్ కాలనీలోని ప్రభుత్వ స్కూల్గ్రౌండ్ను కబ్జాదారుడి నుంచి హైడ్రా కాపాడింది. హెచ్ఎం ఫిర్యాదుతో ఫీల్డ్విజిట్చేసి ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేసింది.
