ప్రభుత్వ ఆస్తుల రక్షణకు హైడ్రా

ప్రభుత్వ ఆస్తుల రక్షణకు హైడ్రా
  •  జీహెచ్​ఎంసీలో డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ విభాగానికి కొత్త పేరు.. కీలక బాధ్యతలు
  • సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్​రెడ్డి వెల్లడి
  • హైదరాబాద్​ ప్రజలకు నిరంతర సేవల కోసం విభాగంలో అనేక మార్పులు
  • చెరువులు, కుంటల రక్షణ.. హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ బాధ్యతలు అప్పగింత
  • తాగునీటి పైపులైన్లు, విద్యుత్తు సరఫరా లైన్లు, ట్రాఫిక్ నియంత్రణ సేవలు కూడా
  • ఓఆర్​ఆర్​ వరకు డిపార్ట్​మెంట్​ పరిధి విస్తరణ 
  • డైరెక్టర్​గా డీఐజీ స్థాయి అధికారి.. అడిషనల్​ డైరెక్టర్లుగా ఎస్పీ స్థాయి ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగానికి అత్యంత కీలక బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు తగ్గట్టు వ్యవస్థాగత మార్పులతో పాటు బాధ్యతల పంపిణీ జరగాలని అధికారులకు ఆయన సూచించారు. కేవలం వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా ఇకపై విపత్తుల నిర్వహణ విభాగం సిటీ ప్రజలకు నిరంతరం సేవలు అందించేలా దాని పునర్ వ్యవస్థీకరణ జరగాలని చెప్పారు. 

ఈ విభాగానికి  హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అని పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నింటిలో హైడ్రా క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, మూసీ డెవలప్​మెంట్​ అధికారులతో సోమవారం సాయంత్రం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. 

ఓఆర్​ఆర్​ వరకు విభాగం విస్తరణ

హైదరాబాద్ భౌగోళిక పరిధిని విస్తరించనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని కూడా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు ఈ విభాగం సేవలు అందించేందుకు అవసరమైన మార్పులు చేయాలన్నారు.  హైడ్రా విభాగానికి డీఐజీ స్థాయి అధికారి డైరెక్టర్​గా, ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ డైరైక్టర్లుగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారు.

 జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, సిటీ ట్రాఫిక్, వివిధ విభాగాల నుంచి ప్రత్యేక టీమ్​లను ఈ విభాగంలో నియమించాలని ఆయన సూచించారు. దాదాపు రెండు వేల కిలోమీటర్ల జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించటం.. సిటీలోని నాలాలు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవకుండా కాపాడే కీలక బాధ్యతలను ఈ విభాగమే చేపట్టాలని నిర్ణయించారు.

 దీంతో పాటు హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగు నీటి పైపులైన్లు, విద్యుత్తు సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వ్యవహారాలన్నింటిలోనూ ఈ విభాగం సేవలను అందిస్తుంది. అందుకు వీలుగా ఈ విభాగం పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది, విధులు, నిధుల కేటాయింపు, బాధ్యతలపై ముసాయిదా సిద్ధం చేయాలని సీఎస్​ శాంతికుమారిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 

మూసీ రివర్​ డెవలప్​మెంట్ పనులు వేగవంతం

మూసీ రివర్ డెవలప్​మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రాజెక్టును సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేలా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టు పని చేయాలన్నారు. హైదరాబాద్ సిటీలోని చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాలు, శిథిలమైన నిర్మాణాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. 

సిటీ లైబ్రరీ, చార్మినార్ సమీపంలోని ఆయుర్వేద హాస్పిటల్, నిజామిమా అబ్జర్వేరటరీ, గుడిమల్కాపూర్ కోనేరు లాంటి వివిధ చారిత్రక ప్రదేశాలపై జీహెచ్ఎంసీ పవర్ పాయింట్ ప్రజంటేషన్​ ఇచ్చింది. వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న వివిధ మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించారు. వీటిలో మూసీ రివర్ డెవెలప్​మెంట్ ప్రాజెక్టులో అనుసంధానం చేసేందుకు వీలైన వాటిని గుర్తించి, అందులోనే జోడించాలని ఆయన అన్నారు. 

సమీక్ష సమావేశంలో సీఎస్​ శాంతికుమారి, మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్భన్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్,  జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి,  జీహెచ్ఎంసీ విజిలెన్స్ విపత్తు నిర్వహణ కమిషనర్ ఏవీ రంగనాథ్, హైదరాబాద్ వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి   పాల్గొన్నారు.