హైదరాబాద్: పుప్పాలగూడలో 200 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ వేసిన ప్రభుత్వ భూమి విలువ 30 వేల కోట్లు ఉంటుందని హైడ్రా అంచనా వేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. హైడ్రా అధికారులు భూమి హద్దుల గుర్తింపు, రక్షణ చర్యలు చేపట్టారు. 250 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన రాతి గుట్టలు, పురాతన రాతి గుహలను హైడ్రా పరిరక్షించింది.
దశాబ్దాలుగా రాళ్ల గుట్టల సంరక్షణ కోసం పోరాడుతున్న సొసైటీ టు సేవ్ రాక్స్ విజ్ఞప్తిపై హైడ్రా స్పందించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో కలిసి భూముల పరిశీలన అనంతరం హైడ్రా ఫెన్సింగ్ వేయడం గమనార్హం.
సర్వే నంబర్ 452/1లో 174 ఎకరాలు, 454/1లో 119.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రికార్డులు ఉన్నాయి. మొత్తం 293.05 ఎకరాల్లో 263.05 ఎకరాలు గతంలో హెచ్ఎండీఏకు కేటాయించారు. గ్రామాల ఓవర్ ల్యాప్ సమస్యల కారణంగా 63.05 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల భూమిగా గుర్తించారు.
ALSO READ : గండిపేట్ ఫేక్ జీవో కేసు..
హెచ్ఎండీఏకు మిగిలిన సుమారు 200 ఎకరాల భూమికి ఇప్పుడు హైడ్రా రక్షణ కల్పించింది. రాళ్ల గుట్టల ప్రాంతంలో ఆలయాలు, దర్గా కోసం కేటాయించిన భూములను మినహాయించి మిగిలిన భూమికి ఫెన్సింగ్ వేసింది. రాళ్ల గుట్టల దగ్గర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.
