
క్యాన్సర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధి. మూడింట రెండొంతుల క్యాన్సర్ మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే సంభవిస్తున్నాయి. అందులో ఎక్కువ భాగం ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయంచేయొచ్చని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది.
ఆ క్యాన్సర్ మహమ్మారి ముందుగా శరీరంలో ఏదో ఒక భాగంలో ఒక చిన్న కణతిగా ఏర్పడి శరీరం మొత్తాన్ని పీక్కు తినేస్తుంది. మరి అలాంటి వ్యాధిని నయం చేసేందుకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కంకణం కట్టుకున్నారు. క్యాన్సర్ ను నయం చేసే ఇమ్యూనో థెరపీపై అనేక పరిశోధనలు చేసి విజయం సాధించారు. దాదాపు 30 సంవత్సరాలుగా క్యాన్సర్ నయం చేసేందుకు వైద్యులు పరిశోధనలు విఫలమవుతూ వచ్చాయి.
30 సంవత్సరాల పాటు సుదీర్ఘ పరిశోధనలు
ఈ నేపథ్యంలో 30 సంవత్సరాల క్రితం పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ కార్ల్ జూన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన పరిశోదనలు ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చాయి . క్యాన్సర్ని కట్టడి చేసే మందుని కనుగొనేందుకు 30సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ప్రక్రియ చివరికీ ఇమ్యూనో థెరపీ అందుబాటులోకి వచ్చింది. బ్లెడ్ క్యాన్సర్ కణాల్లో సీడీ 19 అనే ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రొటీన్ ను నాశనం చేస్తే క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది. దానికి విరుగుడుగా డాక్టర్ జూన్ ఇమ్యూనో థెరపీని వెలుగులోకి తెచ్చారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పరిశోధనల అనంతరం ఈ థెరపీని అందుబాటులోకి తెచ్చారు. సుమారు రూ. కోటి రూపాయాల ఖర్చయ్యే ఈ థెరపీని ఈ ఏడాది చివరిలోపు అమెరికాలోని 35 సెంటర్లలో ప్రవేశపెట్టనున్నారు.