దేశీయ క్యాబ్ హైరింగ్ సంస్థ ఓలాలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండై మోటార్ జరుపుతున్న చర్చలు తుది దశకు వచ్చాయని తెలిసింది. 250 మిలియన్ డాలర్ల( రూ.1,747 కోట్ల) నుంచి 300 మిలియన్ డాలర్ల(రూ.2,097 కోట్ల) వరకు ఓలాలో పెట్టుబడులు పెట్టేందుకు హ్యుండై చూస్తోంది. ఈ పెట్టుబడులతో ఓలాలో 4 శాతం వాటాలను హ్యుండై దక్కించుకుబోతోంది. ఈ డీల్ సక్సెస్ అయితే, ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ లో హ్యుండై పెట్టిన రెండో ఇన్వెస్ట్ మెంట్ ఇదే అవుతుంది. గతేడాది ఆగస్టులో కారు రెంటల్ స్టార్టప్ రేవ్కి హ్యుండై రూ.100 కోట్ల నిధులు అందించింది. హ్యుండై పెట్టుబడితో ఓలా కంపెనీకి మరో మేజర్ ఇన్వెస్టర్ దక్కుతారు. ఓలా చేపడుతోన్న 500 మిలియన్ డాలర్ల(రూ.3,495 కోట్ల) ఈక్విటీ ఫైనాన్సింగ్ రౌండ్లో భాగంగా ఈ పెట్టుబడులు హ్యుండై నుంచి వస్తున్నాయి. వచ్చే కొన్ని వారాల్లో ఈ డీల్ ముగుస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి.
ఓలా ఈక్విటీ ఫైనాన్సింగ్ రౌండ్లో ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సా ల్ కూడా పాల్గొన్నారు. బన్సాల్ ఇటీవలే ఓలాలో రూ.650 కోట్ల పెట్టుబడులు పెట్టారు . హ్యుండై సింగపూర్ రైడ్ షైరింగ్ సంస్థ గ్రాబ్ లో కూ డా 250 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. హ్యుండై పోటీదారులు జనరల్ మోటార్స్, ఫోర్డ్ మోటార్ కంపెనీ, టయోటా మోటార్ కార్పొరేషన్ లు కూడా ఉబర్, లిఫ్ ట్ లాంటి రైడ్ హైరింగ్ కంపెనీలకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇండియాలో కూడా మహింద్రా అండ్ మహింద్రా, ఫోర్డ్లు కారు రెంటల్ సంస్థ జూమ్ కార్లో పలు సార్లు పెట్టుబడులు పెట్టాయి.