శామీర్ పేట వెలుగు: పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు బంగారు భవిష్యత్ అందించేందుకు మేడ్చల్ నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తీన్మార్ మల్లన్న తెలిపారు. శుక్రవారం శామీర్ పేట మండలం అలియాబాద్ పరిధిలోని సంగీత్ కల్యాణ మండపంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు వేయటమే కాదు.. ఓటును మళ్లీ వాపస్ తీసుకునే విధంగా రైట్ టూ రీ కాల్ పద్ధతి ఆయుధాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లక్ష్మాపూర్ మాజీ సర్పంచి సింగం సత్తయ్య, మేడ్చల్ మండల నాయకులు సంజీవ రావు, కార్మిక సంఘాల నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.