ఫిబ్రవరి 27 న దాయాది పాకిస్థాన్తో సరిహద్దు టెన్షన్లు ఎక్కువైన రోజు. శత్రు దేశ విమానాలు మన దేశంలోకి చొరబడి బాంబులేసిన రోజు. మన యుద్ధ విమానాలు వాటిని వెంబడించి తరిమి తరిమి కొట్టే పనిలో పడ్డాయి. ఆ డాగ్ఫైట్ అలా జరుగుతుండగానే బుద్గాంలో మన హెలికాప్టర్ ఎంఐ 17 కుప్పకూలిపోయింది. ఆరుగురు వైమానిక దళ సిబ్బంది, ఒక పౌరుడు చనిపోయారు. పాకిస్థానే కూల్చేసిందని ముందుగా వార్తలొచ్చాయి. ఆ తర్వాత సాంకేతిక సమస్యలతో కూలిపోయిందని వివరణ వచ్చింది. కానీ, ఆ హెలికాప్టర్ కూలిపోవడానికి అవేవీ కారణాలు కాదు. ఎవరూ ఊహించనిది, అనుకోనిది జరిగింది. శత్రువు అనుకుని మనం విసిరిన మిసైలే మన హెలికాప్టర్ను కూల్చేసింది. కేవలం 12 క్షణాల్లోనే దాన్ని నేలమట్టం చేసింది. అవును, పొరపాటునే జరిగినా అదే నిజమని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) విచారణలో తేలిందట. మరో 20 రోజుల్లో ఆ ఘటనకు సంబంధించిన నివేదికను ఐఏఎఫ్ సమర్పించనుందట. ఓ ఆంగ్ల పత్రికకు ఐఏఎఫ్ వర్గాలు ఆ నివేదికకు సంబంధించిన వివరాలను వెల్లడించాయి. పొరపాటునే జరిగినా ఏడుగురి చావుకు కారణమైన వారిపై వైమానిక దళ చట్టం 1950 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారట.
ఆ రోజు అసలేమైంది?
పాక్ యుద్ధ విమానాలు దేశంలోకి చొరబడి కొన్ని చోట్ల బాంబులు విసిరాయి. దీంతో ఎయిర్బేస్లు సహా కాశ్మీర్ మొత్తం అలర్ట్ అయింది. శ్రీనగర్ ఎయిర్బేస్ కూడా సదా సిద్ధం అన్నట్టుగా అప్రమత్తమైంది. భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఇజ్రాయెల్నుంచి కొన్న ‘స్పైడర్’ క్షిపణులను సిద్ధం చేసుకుంది. శత్రువొచ్చిందే ఆలస్యం, వేసెయ్యాలని డిసైడ్ అయ్యింది. కానీ, అదే టైంలో మన హెలికాప్టర్ ఎంఐ 17 గాల్లో ఉందన్న విషయం ఆ ఎయిర్బేస్లో ఉన్నోళ్లకెవరికీ తెలియదు. మన మిసైల్కే బలైపోతామని ఆ హెలికాప్టర్లో ఉన్నోళ్లూ ఊహించలేదు. తక్కువ ఎత్తులో ఏదో హెలికాప్టర్ ఎగురుతున్నట్టు శ్రీనగర్ ఎయిర్పోర్టుకు రాడార్ల ద్వారా తెలిసింది. అది శత్రువుకు చెందిన హెలికాప్టరేనని భావించిన టెర్మినల్ వెపన్స్ డైరెక్టర్ (టీడబ్ల్యూడీ– ఆ టైంలో ఆయనే ఎయిర్బేస్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్గా ఉన్నారు) ఫైరింగ్కు ఆర్డర్లిచ్చేశారట. దీంతో స్పైడర్ మెరుపువేగంతో (మాక్4, ధ్వనికి నాలుగు రెట్ల వేగం) దూసుకెళ్లి 12 సెకన్లలో హెలికాప్టర్ను కూల్చేసి ఏడుగురిని బలి చేసింది.
అదేం లేదు.. ఐఏఎఫ్ అధికారుల వివరణ
ఎంఐ 17ను షూట్ చేసిన వీడియో ఆధారంగా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఐఏఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. హెలికాప్టర్ను మిసైల్ ఢీకొట్టినట్టు వీడియోలో స్పష్టమవుతోందని కొందరు అధికారులు చెప్పిన మాటలను కొట్టిపారేశారు. నిజానికి ఎయిర్బేస్ నుంచి హెలికాప్టర్ ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉందని, అంత దూరంలో ఉన్నప్పుడు కెమెరాతో జూమ్ చేసి చూపించడమన్నది అసాధ్యమని చెప్పారు.