
- గోదావరి దాని ఉపనదులపై ప్రస్తుత, భవిష్యత్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలి
- త్వరలో రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఏపీ బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే.. ఆ ప్రాజెక్టుతో తరలించే నీటికి సమానంగా తెలంగాణకు కృష్ణాలో అదనంగా కేటాయించాలని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ (టీఆర్ఈఏ) డిమాండ్ చేసింది. గురువారం అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేరెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, తన్నీరు వెంకటేశం ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘గోదావరి నుంచి బనకచర్లకు 200 టీఎంసీలను పెన్నా బేసిన్కు తరలించాలని ప్రతిపాదిస్తున్నారు. అందుకు బదులుగా 200 టీఎంసీలను తెలంగాణకు కృష్ణాలో అదనంగా కేటాయించాలి.. దీంతోపాటు గోదావరి, దాని ఉపనదులపై తెలంగాణ చేపట్టిన, పూర్తయిన, కొనసాగుతున్న, భవిష్యత్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం నికర జలాలను కేటాయించాలి’’ అని స్పష్టం చేశారు.
అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఏపీ జీబీ లింక్ ప్రాజెక్టును చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలుత గోదావరి బోర్డు డీపీఆర్ను పరిశీలించాలని, దానిని సీడబ్ల్యూసీకి పంపాక అక్కడి నుంచి హైడ్రలాజికల్ అనుమతులు రావాల్సి ఉంటుందని చెప్పారు. ఆ అనుమతులు వచ్చాక అపెక్స్ కౌన్సిల్లో చర్చించి ఆమోదం పొందాకే ప్రాజెక్టును చేపట్టాలన్నారు.
కానీ ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే చేపట్టి త్వరగా పూర్తి చేస్తే రెండు రాష్ట్రాలకూ ఆర్థిక భారం తప్పుతుందన్నారు. అంతేగాకుండా కరువు ప్రాంతమైన రాయలసీమకు నీళ్లు వస్తాయన్నారు. ఈ 200 టీఎంసీలకు బదులు కృష్ణాలో తెలంగాణకూ కేటాయిస్తే.. పాలమూరు రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ, ఉదయ సముద్రం ప్రాజెక్టులకు నికరంగా కేటాయింపులు వస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.