
హైదరాబాద్: టీఆర్ఎస్ ఫ్యాక్ట్ షీట్ తీసుకొస్తే, బీజేపీ తరఫున తాము చార్జిషీట్ తీసుకొస్తామని ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్రావు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయ వ్యవస్థ విధ్వంసానికి గురైందని మండిపడ్డారు. కేసీఆర్ తీసుకున్న ఆరు నిర్ణయాల వల్ల రాష్ట్రం నాశనమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు పశువధపై బీజేపీ పోరాడుతుందన్నారు.
‘రెగ్యులేటెడ్ క్రాప్ట్ పాలసీ రైతుల వినాశనానికి కారణమవుతోంది. లోపభూయిష్టమైన ఈ పాలసీపై వ్యవసాయ శాస్త్రవేత్తలో చర్చలకు బీజేపీ సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా ఫసల్ బీమా యోజనను కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకాన్ని తెలంగాణలో మాత్రం అమలు చేయడం లేదు. సరిగ్గా లేని క్రాప్ పాలసీ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. తెలంగాణలో ఉన్న మూడు అగ్రికల్చర్ విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వైస్ ఛాన్స్లర్స్, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్స్ లేరు. దీంతో ఆలిండియా రీసెర్చ్ ర్యాంకింగ్స్లో మనం చాలా దిగువకు పడిపోయాం. రుణమాఫీ సబ్సిడీ విషయంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణలో క్యాటిల్ పాలసీ లేదు. వ్యవసాయం, రైతు ఆదాయం పెంపులో పశుపోషణ కీలకమని చెప్పొచ్చు. కానీ రాష్ట్రంలో క్యాటిల్ పాలసీ లేదు. కర్నాటకలో గోవధ విషయంలో యడ్యూరప్ప ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. పశుధనం విషయంలో ముఖ్యమైన చర్యలు తీసుకుంటోంది. తెలంగాణలో కూడా కర్నాటక లాంటి చట్టాన్ని తీసుకురావాలి’ అని మురళీధరరావు పేర్కొన్నారు.