సిద్దిపేట: పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య తెలంగాణ కావాలంటే అందరం యోగా చేద్దామన్నారు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు..తాను ప్రతి రోజూ యోగా సాధన చేస్తానన్నారు. ప్రపంచాన్ని వ్యాధులు వణికిస్తున్నాయని.. మానవ మనుగడను సవాల్ చేస్తున్నాయన్నారు. ఈ రోగాల కల్లోలాలను ఎదుర్కోవడానికి యోగా అద్భుత అవకాశమని తెలిపారు మంత్రి. యోగా జీవితంలో ఒక భాగం కావాలని.. ప్రతి రోజు యోగా సాధన చేస్తే రోగాలను నిలువరించవచ్చని తెలిపారు.
సిద్ధిపేట జిల్లాలో యోగాను గతేడాది పాఠశాలల్లో క్రియాశీలకంగా ప్రవేశపెట్టి మంచి సత్ఫలితాలను సాధిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో యోగా సాధన చేయాలని తెలిపారు. యోగాతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఎలాంటి వ్యాధులైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుందన్న హరీష్.. పైసా ఖర్చు లేకుండా ఉన్న యోగాను అందరూ సాధన చేసి ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దామన్నారు.