
భారత ఎన్నికల సరళి, పోలింగ్ విధానం.. టెక్నాలజీతో పాటు మారుతూ వస్తోంది. ఓటర్ స్లిప్పుల నుంచి EVM మెషీన్లకు మార్పు చెందడం ప్రపంచానికే ఆదర్శంగా చెప్పుకుంటున్న సందర్భం. టెక్నాలజీతో అనుసంధానం చేయటం ద్వారా అత్యంత విశ్వసనీయంగా, అక్రమాలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తున్నామని ఎన్నికల సంఘం చెప్పుకుంటున్న తరుణం. కానీ ఈవీఎం లు వచ్చిన తర్వాత కూడా రిగ్గింగ్ జరుగుతోందని.. దేశ వ్యాప్తంగా తాము గెలవాల్సి ఉంటే మరో పార్టీ గెలిచిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ గత కొంతకాలంగా ఆరోపిస్తూ వస్తోంది.
ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఒక రాష్ట్రంలో ఆరు నెలల్లోనే వేల సంఖ్యలో ఓటర్లు లిస్టులోకి చేరడం.. తప్పుడు అడ్రస్ అని తేలడం సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా సీఎం గెలిచిన స్థానంలోనే ఆరు నెలల్లో 30 వేల ఫేక్ ఓటర్లు లిస్టులో చేరినట్లు ఒక రిపోర్ట్ రావడం ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని ఇరకాటంలో పెట్టాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల సంఘం మద్ధతుతో బీజేపీ, ఎన్డీఏ పార్టీలు అక్రమంగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్రలో కూడా రిగ్గింగ్ కు పాల్పడ్డారని, సీఎంతో సహా చాలా మంది నేతలు అక్రమ ఓట్లతోనే గెలిచారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా న్యూస్ లాండ్రీ అనే వెబ్ సైట్ ఆధారాలతో సహా ఫేక్ ఓటర్ల లిస్టుతో రిపోర్టు విడుదల చేసింది.
2024 లోక్ సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రాతినిథ్యం వహిస్తున్న నాగ్ పూర్ సౌత్ వెస్ట్ స్థానంలో 29,219 కొత్త ఓటర్లు చేరినట్లు రిపోర్టు వెల్లడించింది. అంటే యావరేజ్ గా రోజుకు 162 కొత్త ఓట్లు యాడ్ అయ్యాయి. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 4 శాతం ఓట్లు యాడ్ కావడం సహజం. కానీ దానికి రెండింతలు అంటే 8.25 శాతం ఓటర్లు జమ కావడం అనుమానాలకు తావిస్తోంది.
అయినప్పటికీ ఎలాంటి విచారణ, తనిఖీలు జరగలేదని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో అత్యధికంగా ఓటర్లు చేరడం గమనించినట్లు స్థానిక పోలింగ్ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు.
అయితే Newslaundry తనిఖీలలో కేవలం 50 బూత్ స్టేషన్లలోనే 4,000 ఓటర్లు చేరినట్లు.. అది కూడా వారికి ఎలాంటి అడ్రస్ కూడా లేనట్లుగా తేలింది. ఆ నియోజకవర్గంలో అవి భోగస్ ఓట్లా కాదా అనే కోణంలో ఎన్నికల సంఘం విచారణ చేయాల్సి ఉంది.
నాగ్ పూర్ సౌత్ వెస్ట్ స్థానంలో 2,301 ఓట్లను తొలగించారు. ఈ స్థానం నుంచి ఫడ్నవీస్ 39 వేల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రఫుల్ గుడాధే ను ఓడించారు. ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ కు ఇది వరుసగా నాలుగో విజయం. లోక్ సభ పోలింగ్ తో పోల్చితే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో బీజేపీకి 14,225 ఓట్లు అదనంగా వచ్చాయి. కాంగ్రెస్ కు కేవలం 8 వేల ఓట్లు అధికంగా వచ్చాయి.
ఈ విషయంలో ఎన్నికల సంఘం ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తో పాటు మహారాష్ట్రలో కూడా రిగ్గింగ్ జరిగితే.. ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఆ ఓటర్లను ట్రేస్ చేయలేం:
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏ నియోజక వర్గంలోనైనా 4 శాతం కొత్త ఓటర్లు జమ కావడం సహజం. అదే విధంగా 2 శాతం లోపు డిలీట్ చేయడం కూడా సహజం.. 4 శాతానికి మించి కొత్త ఓటర్లు చేరినా.. 2 శాతానికి మించి డిలీట్ అయినా.. క్రాస్ వెరిఫికేషన్ చేసి.. అవి ఫేక్ ఓట్లా కాదా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఎన్నికల అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘2 శాతం, 4 శాతం ఓటర్లు చేరడం ఓకే. కానీ అంతకు మించి ఓటర్లు చేరుతున్నారంటే డబుల్ చెక్ చేసుకోవాల్సిందే’’నని అన్నారు.
ఆ నియోజకవర్గంలో మొత్తం 378 బూత్ లు ఉంటే.. 70 శాతం అంటే 263 బూత్ లలో 4 శాతానికి పైగా కొత్త ఓటర్లు చేర్చినట్లు రిపోర్ట్ లో తేలింది. అందులో 26 బూత్ లలో 20% శాతానికి పైగా ఓట్లు యాడ్ అయ్యాయని, మరో 4 బూత్ లలో 40 శాతాన్ని మించి జమ అయినట్లుగా తేలింది. ఈ కొత్త ఓటర్లకు అడ్రస్ లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. కేవలం ఒక్క నియోజకవర్గంలోనే ఇన్ని ఫేక్ ఓట్లు వచ్చినప్పుడు.. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏంటని స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్రలో రిగ్గింగ్ చేసి గెలిచారనేందుకు ఇదే సాక్ష్యమని, ఎన్నికల సంఘం విచారణ జరపాలని పోలింగ్ బూత్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.