
-రాళ్లలా మారిపోయిన గుడ్లు..
-సుత్తితో మోదినా పగలవు..
-గడ్డ కట్టిన జ్యూస్ ప్యాకెట్లు.. తాగడం కథ అటుంచితే, కనీసం ‘తినడానికి’ కూడా పనికిరావు.
-ఇక కూరగాయలు.. కొరికితే గాయాలు. గోడకేసి కొట్టినా చుక్క రసం కూడా కారదు.
మైనస్ 40 నుంచి 70 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సియాచిన్ గ్లేసియర్లో ఇండియన్ సోల్జర్ల ప్రస్తుత పరిస్థితి ఇది. ప్రపంచంలోనే అతి ఎత్తైన సైనిక గస్తీ ప్రాంతమైన సియాచిన్లో దేశ రక్షణ కోసం ఇండియన్ సోల్జర్లు ప్రాణాలకు తెగించి పహారా కాస్తున్నారు. ప్రతి క్షణం యుద్ధం చేస్తున్నారు. అయితే వారు వార్ చేస్తున్నది మంచు పర్వతాల్లో ఎప్పుడొస్తారో తెలియని శత్రువులతో కాదు. నిప్పును కూడా గడ్డ కట్టించే చలితో. తీవ్ర వాతావరణ పరిస్థితుల మధ్య దినదిన గండంలా గడుపుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ తిప్పలను వివరిస్తూ ముగ్గురు జవాన్లు వీడియో తీశారు. దాన్ని ట్విట్టర్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
ఇటుకలా జ్యూస్ ప్యాకెట్
ముందుగా జ్యూస్ ప్యాకెట్ను ఓ జవాన్ తెరవడానికి ప్రయత్నించాడు. అది పూర్తిగా గడ్డ కట్టిపోయింది. ప్యాకెట్ను కత్తితో తొలగించి గడ్డ కట్టిన జ్యూస్ను బల్లపై పెట్టారు. అది అచ్చం ఇటుకలా ఉంది. సుత్తితో బాదినా అది పగల్లేదు. తర్వాత కోడి గుడ్లను పగలగొట్టడానికి ప్రయత్నించాడు మరో జవాన్. పగలలేదు. నేలకేసి కొట్టారు. బంతుల్లా ఎగిరాయి. పగలలేదు. ఆఖరికి సుత్తితో మోదారు. అయినా అదే సీన్. కూరగాయల పరిస్థితి కూడా ఇంతే. అల్లం, టమోటాలు, బంగాళాదుంపలను కత్తితో కోస్తే తెగలేదు. గొడ్డలితో చెట్లను నరికినట్లు నరికితే గానీ అవి ముక్కలు కాలేదు. ‘‘మేం జ్యూస్ తాగాలంటే, దాన్ని వేడి చేయాలి’’ అంటూ ఓ జవాను బాధపడ్డాడు. ‘‘సుత్తితో కొట్టినా గుడ్లు పగలడం లేదు. ఇవి గ్లేసియర్ గుడ్లు. ప్రస్తుతం మైనస్ 40 నుంచి 70 డిగ్రీల లు నమోదవుతున్నాయి. ఇక్కడ ఉండటం అంత ఈజీ కాదు” అని మరో సైనికుడు చెప్పుకొచ్చాడు.