
యాదాద్రి, వెలుగు: యాదాద్రి ఆలయంలో 36 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో 14 మంది ఆలయ పూజారులు, 17 మంది స్టాఫ్, బ్రహ్మోత్సవాలకు వచ్చిన ఐదుగురు రుత్వికులు ఉన్నారు. పరిసర గ్రామాల్లోనూ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. కరోనా ఎఫెక్ట్తో ఆలయంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్టు ఈవో గీతారెడ్డి ప్రకటించారు. ఈ మూడు రోజులు భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఆలయంలో ఈ నెల 15 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా కొండకింద నిర్వహించిన స్వామి వారి కల్యాణానికి హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవాలు ముగియడంతో రెండు రోజుల నుంచి కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇప్పటివరకు 100 మందికి టెస్టులు చేయగా 36 మందికి పాజిటివ్గా తేలింది. ఆలయంలో పూజారులు, స్టాఫ్ కలిపి మొత్తం 290 మంది ఉన్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 150 మంది వరకు ఉంటారు. మిగిలిన స్టాఫ్కు టెస్టులు చేస్తే కేసులు పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఆలయంలో భక్తులకు లఘు దర్శనం కూడా నిలిపివేయొచ్చు. యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురంలో 16 మందికి కరోనా సోకింది. ఈ ఊరు ఆలయానికి సమీపంలోనే ఉంటుంది.