ట్రాన్స్ జెండర్ల సమస్యల పరిష్కారం, ఉపాధి కల్పన కోసం రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో "ప్రజ్వల" సంస్థ సహకారంతో ప్రత్యేక కౌన్సెలింగ్ సెంటర్ 'వికల్ప్' ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ని డీజీపీ అంజనీ కుమార్, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తదితరులతో కలిసి మీర్ పేట్ పోలీస్ స్టేషన్లో దీనిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన నేర రహిత సమాజ నిర్మాణంలో కీలకమైన కార్యక్రమాలలో భాగంగా ఇలాంటి కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించడాన్ని అభినందించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రజ్వల సంస్థ చేస్తున్న కృషిని ఆయన ప్రస్తావించారు.
"వికల్ప్" కేంద్రం ద్వారా ట్రాన్స్ జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. నేర రహిత సమాజాన్ని నిర్మించడంలో "వికల్ప్" కేంద్రం ప్రముఖ పాత్ర వహిస్తుందని, ట్రాన్స్ జెండర్ల జీవితాల్లో మార్పు తీసుకువస్తుందని ఆకాంక్షించారు.
