శ్రద్ధా వాకర్ తరహాలో 2 హత్యలు

శ్రద్ధా వాకర్ తరహాలో 2 హత్యలు

రాంచీ, జైపూర్​: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య లాంటి దారుణ ఘటన జార్ఖండ్, రాజస్థాన్ లలో చోటుచేసుకుంది. జార్ఖండ్ లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. బోరియో సంతాలి ప్రాంతంలో నివసిస్తున్న దిల్దార్ అన్సారీ(28), అతని రెండవ భార్య రూబికా పహాడిన్‌(22)ను దారుణంగా చంపాడని పోలీసులు ఆదివారం తెలిపారు. నిందితుడు, రూబికాను ప్రేమించి నెల కిందటే రెండవ పెళ్లి చేసుకున్నాడని.. విషయం తెలియడంతో మొదటి భార్య, ఇతర కుటుంబసభ్యులతో గొడవలు మొదలయ్యాయని వివరించారు. కుటుంబ సభ్యుల సహకారంతో రూబికాను హత్య చేసినట్లు నిందితుడు చెప్పాడన్నారు. సాక్ష్యాలు దొరకకుండా రూబికా మృతదేహాన్ని ఎలక్ట్రిక్ కట్టర్‌తో ముక్కలు చేసి.. వివిధ ప్రాంతాల్లో విసిరేశాడని పోలీసులు తెలిపారు. బోరియా ప్రాంతంలో విసిరేసిన శరీర భాగాలను కుక్కలు పీక్కు తినడం చూసి స్థానికులు తమకు సమాచారం అందించారని వెల్లడించారు. చనిపోయిన యువతి రూబికానే అని గుర్తించామని పోలీసులు చెప్పారు.

మేనత్తను చంపిన జైపూర్ యువకుడు

రాజస్థాన్​లోని జైపూర్​లో మేనత్తను చంపి, 10 ముక్కలు చేశాడో యువకుడు. శరీర భాగాలను బకెట్ లో తీసుకెళ్లి వివిధ ప్రాంతాల్లో  పడేశాడు. ఆపై ఏమీ తెలియనట్లుగా అత్తమ్మ కనిపించట్లేదని పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దర్యాప్తులో యువకుడే హంతకుడని తేలడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. జైపూర్ లోని విద్యానగర్ లో అనూజ్ శర్మ(33) అనే యువకుడు తన తండ్రి, చెల్లెలు, మేనత్తతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల చెల్లెలు, తండ్రి ఇండోర్ వెళ్లగా.. ఇంట్లో అనూజ్, సరోజ్​ శర్మ మాత్రమే ఉన్నారు. ఈ నెల 11న ఢిల్లీకి వెళతానని అనూజ్​ చెప్పగా.. సరోజ్​వద్దని ఆపేసింది. దీంతొ కోపం పట్టలేక అనూజ్ సుత్తితో తలపై కొట్టడంతో సరోజ్​ చనిపోయింది.