హైదరాబాద్, వెలుగు: ఇన్కమ్ ట్యాక్స్లో జరిగిన రీ ఫండ్, ఐటీ మినహాయింపుల స్కామ్పై ఐటీ శాఖ స్పందించింది. తప్పుడు రిటర్న్స్ దాఖలు చేసిన వారిని వేల సంఖ్యలో గుర్తించామని స్పష్టం చేసింది. అలాంటి వారికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు సవరణలకు అవకాశం ఇచ్చింది. ఐటీ క్లెయిమ్ రిటర్న్స్ రీఫండ్, మినహాయింపుల్లో రూ.కోట్లు కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన వివరాలను శుక్రవారం మాసబ్ ట్యాంక్లోని ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత వెల్లడించారు. ఏపీ, తెలంగాణలో ఐటీ రీఫండ్ స్కామ్ జరిగినట్లు గుర్తించామని స్పష్టం చేశారు. 2021–22 ఆర్థిక ఏడాదిలో 34 శాతం రీ ఫండ్స్, మినహయింపులతో కూడిన రిటర్న్స్ దాఖలు కాగా, 2022–23 ఆర్థిక ఏడాదిలో 84 శాతానికి పెరిగాయని ఆమె తెలిపారు. ఈ భారీ వ్యత్యాసాన్ని గుర్తించి అలర్ట్ అయ్యామన్నారు.
డేటా అనాలసిస్ సెంటర్లో డాక్యుమెంట్ల పరిశీలన..
బెంగళూర్లోని డేటా అనాలసిస్ సెంటర్ ద్వారా ఐటీ పేయర్స్ ఫైల్ చేసిన రిటర్న్స్ డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్లు మిథాలి మధుస్మిత తెలిపారు. గత మూడేండ్లుగా కొందరు ఇలాంటి తప్పుడు రిటర్న్స్ దాఖలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇందులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,
సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేటు ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో నిర్వహించిన 9 కేసుల్లో వేల సంఖ్యలో ఇలాంటి వారిని గుర్తించామని తెలిపారు. క్లెయిమ్ చేసిన వారిని డేటా బేస్ ఆధారంగా ట్రేస్ చేస్తున్నామన్నారు. ఎంత మొత్తంలో స్కామ్ జరిగిందో ఇప్పుడే చెప్పలేమని ఆమె అన్నారు. మూడేండ్ల కిందట ఫైల్ చేసిన రీ ఫండ్ రిటర్న్స్ పరిశీలిస్తున్నామని తెలిపారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తప్పుడు క్లెయిమ్స్ను సరిచూసుకోవాలి..
ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, టాక్స్ పేయర్స్పై కూడా విచారణ జరుపుతున్నామని మిథాలి మధుస్మిత తెలిపారు. ట్యాక్స్ చెల్లింపులు చేసే ఉద్యోగులు రీ ఫండ్, ట్యాక్స్ మినహాయింపుల కోసం మధ్యవర్తులను, ట్యాక్స్ కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. తప్పుడు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు.2021–22, 2022–23, 2023–24 ఆర్థిక ఏడాది కోసం ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్లో తప్పుడు క్లెయిమ్స్ను సరిచూసుకోవాలని సూచించారు. మధ్యవర్తులతో కాకుండా బషీర్బాగ్ ఆయాకర్ భవన్లో ఉన్న ఐటీ ఆఫీసు లేదా ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్, హెల్ప్లైన్ నంబర్స్ 18001030025/18004190025కు కాల్ చేయొచ్చని సూచించారు. మాల్ ప్రాక్టీస్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆదాయ వివరాలను తప్పుగా ఫైల్ చేసిన వారికి 12 శాతం వడ్డీ, 200 శాతం ట్యాక్స్ పెనాల్టీ రూపంలో వసూలు చేస్తామన్నారు. మీడియా సమావేశంలో చీఫ్ కమిషనర్లు శిశిర్ అగర్వాల్, రవికిరణ్, జయకుమార్, అధికారులు పాల్గొన్నారు.