- ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 450 కేసులు
- పదుల్లోనే ప్రకటిస్తున్న వైద్యారోగ్య శాఖ
- ప్రైవేట్ హాస్పిటళ్లలో పెరుగుతున్న రోగులు
నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. గతేడాతో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది డెంగీతో హాస్పిటళ్లలో చేరుతున్న తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 450 మంది డెంగీతో బాధపడుతున్నట్లు సమాచారం. 50 రోజుల్లో 150కి పైగా కేసులు బయటపడినట్లు తెలిసింది. అయితే.. వైద్యారోగ్య శాఖ మాత్రం నిజామాబాద్ జిల్లాలో 36, కామారెడ్డి జిల్లాలో 28 కేసులు నమోదైనట్లు ప్రకటించింది. ప్రైవేట్ హాస్పిటళ్లలో దాదాపు 300 మంది పేషెంట్లు ఉన్నా వాటిని ప్రభుత్వ లెక్కల్లో చూపడంలేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలు, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలు, వర్ని, కోటగిరి నందిపేట మండలాల్లో డెంగీ కేసులు ఎక్కువగా వస్తున్నాయి.
నివారణ చర్యలేవి?
ఇటీవల కురిసిన వర్షాలుకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి దోమలు వృద్ధి చెందాయి. వీటి వల్ల జనం రోగాల బారిన పడుతున్నారు. చాలా మంది వైరల్ ఫీవర్లు రావడంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇందులో కొంతమందికి డెంగీగా నిర్ధారణ అవుతోంది. అయితే ప్రభుత్వం, ఆరోగ్యశాఖ మాత్రం డెంగీ నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. గతేడాది కూడా ఆగస్టులో ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసులు నమోదైన కావడంతో ఎంటమాలజిస్ట్ ఆఫీసర్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. డెంగీ తీవ్రత పరిశీలించి దోమల శాంపిళ్లను సేకరించారు. 12 నెలలు దాటినా డెంగీ వ్యాప్తి గల కారణాల నివేదిక వెల్లడించలేదు. జిల్లా వ్యాప్తంగా డెంగీ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేయలేదు. మరో వైపు జీజీహెచ్లో ఒక్క సెంటర్ మాత్రమే ఉండడం.. అక్కడ రోజుకు 60 టెస్టులు మాత్రమే చేస్తుండడంతో వ్యాధి బారిన పడిన జనం టెస్ట్ కోసం ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారు. వారు పీజుల పేరుతో వేలాది రూపాయలను వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
దోమలతోనే రోగాలొస్తున్నాయి
నగరంలో చెత్త చెదారం పేరుకపోతోంది. డ్రైనేజీల్లో మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు పెరిగిపోతున్నాయి. వాటితేనే జ్వరాలు వస్తున్నయ్. సీజన్ వ్యాధుల నివరణకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి.
- భిక్షపతి స్థానికుడు
రోజుకు 60 టెస్టులు చేస్తున్నాం..
జిల్లాలో వైరల్ ఫీసర్లు పెరుగుతున్నాయి. జ్వరాలన్నీ డెంగీ అని ఎవరూ అనుకోవద్దు. డెంగీ రోగుల కోసం జీజీహెచ్లో స్పెషల్ వార్డులు ఏర్పాటు చేశారు. రోజూ 60 మందికి టెస్టులు చేస్తున్నాం. వైరల్ ఫీవర్ వచ్చిన వారిని కూడా అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నాం.
- ప్రతిమారాజ్, సూపరింటెండెంట్, జీజీహెచ్