
బర్మింగ్హామ్: వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) టోర్నమెంట్లో భాగంగా బర్మింగ్హామ్లో ఆదివారం ఇండియా చాంపియన్స్– పాకిస్తాన్ చాంపియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా శిఖర్ ధవన్ సహా పలువురు ఇండియా వెటరన్ ప్లేయర్లు ఈ మ్యాచ్ ఆడటానికి నిరాకరించడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సహ-యజమానిగా ఉన్న డబ్ల్యూసీఎల్ ఈ నెల 18న మొదలైంది. ఇండియా చాంపియన్స్ జట్టుకు యువరాజ్ సింగ్ కెప్టెన్గా ఉండగా, ధవన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా వంటి టాప్ క్రికెటర్లు జట్టులో ఉన్నారు.
ఇండియా ఆటగాళ్లు పాక్తో ఆడటానికి నిరాకరించిన నేపథ్యంలో మ్యాచ్ను రద్దు చేసినట్టు డబ్ల్యూసీఎల్ ఆర్గనైజర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మ్యాచ్ ఏర్పాటు వల్ల ఇండియా టీమ్కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్తో మ్యాచ్లో తాను ఆడనని ధవన్ కూడా ప్రకటన చేయగా.. రాజ్యసభ ఎంపీ అయిన హర్భజన్ సింగ్, లోక్సభ ఎంపీ యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ కూడా ఈ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ముందుగా ఈ టోర్నీలో పాక్తో ఆడేందుకు ఒప్పుకున్న ఇండియా ప్లేయర్లపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా, ఇండియా– పాక్ కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి.