ఇండియా గోల్డెన్‌‌‌‌‌‌‌‌‌‌ పంచ్‌‌‌‌.. బాక్సింగ్‌‌లో 7 స్వర్ణాలు,  రజతంతో మెరిసిన నీరజ్‌

ఇండియా గోల్డెన్‌‌‌‌‌‌‌‌‌‌ పంచ్‌‌‌‌.. బాక్సింగ్‌‌లో 7 స్వర్ణాలు,  రజతంతో మెరిసిన నీరజ్‌

Commonwealth Games 2026: కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో ఇండియా బాక్సర్ల పంచ్‌‌‌‌ అదిరింది. మొత్తం 10 బాక్సర్లు ఫైనల్​ చేరగా 7 స్వర్ణాలు, 2 రజతాలు లభించాయి. ప్రీతి పవార్‌‌‌‌, జైస్మిన్‌‌‌‌ లాంబోరియా గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ గెలవగా, జాదుమణి సింగ్‌‌‌‌, లవ్లీనా బోర్గోహైన్​ సిల్వర్‌‌‌‌ను సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌ 54 కేజీల ఫైనల్లో ప్రీతి 5–0తో స్కార్లెట్‌‌‌‌ డెల్గాడో (కెనడా)పై ఏకపక్ష విజయం సాధించింది. స్టార్టింగ్‌‌‌‌ నుంచే పంచ్‌‌‌‌ల వర్షం కురిపించిన ప్రీతి 10–8తో తొలి రౌండ్‌‌‌‌ను సాధించింది. రెండో రౌండ్‌‌‌‌లోనూ సానుకూల దృక్పథంతో ముందుకెళ్లింది. స్కార్లెట్‌‌‌‌ పుంజుకునే ప్రయత్నం చేసినా ప్రీతి ఎక్కడా చాన్స్‌‌‌‌ ఇవ్వలేదు. అప్పర్‌‌‌‌ కట్స్‌‌‌‌తో ప్రత్యర్థిని కట్టడి చేసింది. 57 కేజీ ఫైనల్లో వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ జైస్మిన్‌‌‌‌ 5–0తో డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ మిచెలా వాల్ష్‌‌‌‌ (ఐర్లాండ్‌‌‌‌)ను చిత్తు చేసింది. తొలి రౌండ్‌‌‌‌లో ఇద్దరు బాక్సర్లు హోరాహోరీగా పోరాడటంతో జైస్మిన్‌‌‌‌ స్ప్లిట్‌‌‌‌తో తొలి రౌండ్‌‌‌‌ను గెలుచుకుంది. అయితే రెండో రౌండ్‌‌‌‌లో వ్యూహాత్మక పంచ్‌‌‌‌లతో ఆకట్టుకున్న జైస్మిన్‌‌‌‌ వరుస పాయింట్లతో విజయాన్ని ఏకగ్రీవం చేసింది. మెన్స్‌‌‌‌ 55 కేజీల తుది పోరులో జాదుమణి సింగ్‌‌‌‌ 0–5తో జై డిక్సన్‌‌‌‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తనకంటే పొడుగ్గా ఉన్న ఆసీస్‌‌‌‌ బాక్సర్‌‌‌‌తో కాస్త ఇబ్బందిపడినా తొలి రౌండ్‌‌‌‌లో 3–2 ఆధిక్యంలో నిలిచాడు. కానీ తర్వాతి రౌండ్లలో డిక్సన్‌‌‌‌ బలమైన లెఫ్ట్‌‌‌‌ హుక్స్‌‌‌‌ పంచ్‌‌‌‌లతో విరుచుకుపడ్డాడు. వీటినుంచి తప్పించుకునే క్రమంలో జాదుమణి ఎక్కువగా డిఫెన్స్‌‌‌‌కు మొగ్గడంతో పాయింట్లు కోల్పోయాడు. విమెన్స్‌‌ 51 కేజీ ఫైనల్లో సాక్షి చౌదరి 5–0తో రూబీ వైట్‌‌ (ఇంగ్లండ్‌‌)పై, 60 కేజీ ఫైనల్‌‌ బౌట్‌‌లో ప్రియా గంగాస్‌‌ 4–1తో మేరీ-బతూల్ అల్-అహ్మదీయ (కెనడా)పై, 70 కేజీల్లో అరుంధతి చౌదరి 5–0తో చాంటెల్లి రీడ్‌‌ (ఇంగ్లండ్‌‌)పై గెలిచి స్వర్ణాలు సాధించారు. మెన్స్‌ 60 కేజీ ఫైనల్లో సచిన్‌ 3–2తో ట్రైగాన్‌ మార్నింగ్‌ డెవెలో (నమీబియా)పై, 80 కేజీల్లో అంకుశ్‌ 4–1తో దిమిజి షిట్టు (కెనడా)పై గెలిచి స్వర్ణాలు సాధించారు. విమెన్స్‌ 70 కేజీల్లో లవ్లీనా బోర్గోహైన్‌ 1–4తో ఎమ్మా సు గ్రీన్‌ట్రీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడి సిల్వర్‌ మెడల్‌తో సరిపెట్టుకుంది.

నీరజ్‌‌‌‌ రజతంతో సరి..

భారీ ఆశలతో బరిలోకి దిగిన జావెలిన్‌‌‌‌ సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ నీరజ్‌‌‌‌ చోప్రా.. కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో నీరజ్‌‌‌‌ ఈటెను 85.83 మీటర్ల దూరం విసిరి రెండో ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. ఈ సీజన్‌‌‌‌లో పాల్గొన్న తొలి ఈవెంట్‌‌‌‌ కావడంతో నీరజ్‌‌‌‌ ఎక్కువగా రిస్క్‌‌‌‌ తీసుకోలేదు. రెండో ప్రయత్నంలో ఈ దూరాన్ని నమోదు చేశాడు. దోహా డైమండ్‌‌‌‌ లీగ్‌‌‌‌లో 85.69 మీటర్ల దూరాన్ని అధిగమించడం కాస్త విశేషం. కామన్వెల్త్‌‌‌‌లో నీరజ్‌‌‌‌కు ఇది రెండో పతకం. 2018 గోల్డ్‌‌‌‌ కోస్ట్‌‌‌‌లో స్వర్ణం గెలిచాడు. ఇక గ్లాస్గో  గేమ్స్‌‌‌‌లో డెబ్యూ చేసిన యశ్వీర్‌‌‌‌ ఆఖరి ప్రయత్నంలో 85.41 మీటర్ల దూరం విసిరి మూడో ప్లేస్‌‌‌‌తో బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రుమేశ్‌‌‌‌ తరంగ (శ్రీలంక, 89.75 మీటర్లు)కు స్వర్ణం లభించింది. ఇండియాకే చెందిన రోహిత్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (81.56 మీటర్లు) ఏడో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. 

రాణాకు స్వర్ణం

కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌లో ఇండియా అథ్లెట్ల పతకాల పంట పండించారు. పారా షాట్‌‌‌‌ఫుట్‌‌‌‌లో సోమన్‌‌‌‌ రాణా స్వర్ణం గెలుచుకోగా, ట్రిపుల్‌‌‌‌ జంపర్లు ప్రవీణ్‌‌‌‌ చిత్రవేల్‌‌‌‌, సెల్వ ప్రభు వరుసగా రజతం, కాంస్యం నెగ్గారు. మెన్స్‌‌‌‌ ఎఫ్‌‌‌‌–57 విభాగంలో రాణా ఇనుప గుండును 13.40 మీటర్ల దూరం విసిరి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. ఈ సీజన్‌‌‌‌లో అతనికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇండియాకే చెందిన శుభమ్‌‌‌‌ జుయాల్‌‌‌‌ 13.28 మీటర్ల దూరం విసిరి రజత పతకం సొంతం చేసుకున్నాడు. సెడ్రిక్‌‌‌‌ అజామ్‌‌‌‌డ్జీ (కామెరూన్‌‌‌‌, 12.57 మీటర్లు) కాంస్యం సాధించాడు. ఇక మెన్స్‌‌‌‌ ట్రిపుల్‌‌‌‌ జంప్‌‌‌‌ ఫైనల్లో ప్రవీణ్‌‌‌‌ చిత్రవేల్‌‌‌‌ 16.58 మీటర్లు దూకి సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిశాడు. సెల్వ ప్రభ్‌‌‌‌ 16.52 మీటర్లతో కాంస్యం నెగ్గాడు. ఇంటర్నేషనల్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో సెల్వకు ఇదే తొలి పతకం కావడం విశేషం. జోర్డాన్‌‌‌‌ స్కాట్‌‌‌‌ (జమైకా, 16.72 మీటర్లు)కు గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ లభించింది. పారా అథ్లెటిక్స్‌‌‌‌లో మెన్స్‌‌‌‌ టీ54లో 1500 మీటర్ల ఫైనల్లో రమేష్‌‌‌‌ షణ్ముగం 3:23.59 సెకన్ల టైమింగ్‌‌‌‌తో ఏడో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. రవీనా డిస్‌‌‌‌క్వాలిఫై అయ్యింది.


ఉన్నతికి కాంస్యం

విమెన్స్‌‌‌‌ 63 కేజీల్లో ఉన్నతి శర్మ బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిసింది. రెప్‌‌‌‌ఛేజ్‌‌‌‌ బౌట్‌‌‌‌లో ఉన్నతి ఇప్పోన్‌‌‌‌ ద్వారా స్కై నోస్టర్ (సౌతాఫ్రికా)పై గెలిచింది. రౌండ్‌‌‌‌–16లో లామేముల మగాగులపై ఉన్నతి ఈజీగా గెలిచింది. వరుసగా రెండు వజా–ఆరీలు  సాధించి కేవలం ఒక నిమిషం 39 సెకన్లలోనే ఇప్పోన్‌‌‌‌తో విజయం సాధించింది. ఆ తర్వాత క్వార్టర్స్‌‌‌‌లో కోనా క్రిస్టీ (న్యూజిలాండ్‌‌‌‌)పై అతి కష్టం మీద గెలిచింది. ఒక యూకోతో పాటు వజా–ఆరీతో పాయింట్లు సాధించి సెమీస్‌‌‌‌లోకి అడుగుపెట్టింది. మెన్స్‌‌‌‌ 81 కేజీల్లో హర్ష్‌‌‌‌ టోకాస్‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ ప్లే ఆఫ్‌‌‌‌ బౌట్‌‌‌‌కు అర్హత సాధించాడు. సెమీస్‌‌‌‌ బౌట్‌‌‌‌లో హర్ష్‌‌‌‌ టోకాస్‌‌‌‌ 0–1తో ఒడిసియాస్‌‌‌‌ జార్గాకిస్‌‌‌‌ (సైప్రస్‌‌‌‌) చేతిలో ఓడాడు. కానీ యూకోస్‌‌‌‌ ఫైనల్‌‌‌‌కు చేరడంతో టోకాస్‌‌‌‌కు రెప్‌‌‌‌ఛేజ్‌‌‌‌ ఆడే చాన్స్‌‌‌‌ లభించింది. ఇందులో టోకాస్‌‌‌‌.. పెనియామినా పెర్సివాల్‌‌‌‌పై గెలిచి పుంజుకున్నాడు. రెప్‌‌‌‌ఛేజ్‌‌‌‌ రౌండ్లలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన ఇనుంగాన్బి తఖెల్లంబం (విమెన్స్‌‌‌‌ 70 కేజీ), కరణ్‌‌‌‌జీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ మాన్‌‌‌‌ (మెన్స్‌‌‌‌ 90 కేజీ) పతకాలు లేకుండానే నిష్క్రమించారు. 

తేజస్విన్‌‌‌‌కు బ్రాంజ్‌‌‌‌

దీర్ఘకాలంగా వేధిస్తున్న మోకాలి గాయాన్ని అధిగమించిన జాతీయ రికార్డు హోల్డర్‌‌‌‌ తేజస్విన్‌‌‌‌ శంకర్‌‌‌‌.. గేమ్స్‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిశాడు. శుక్రవారం రాత్రి జరిగిన మెన్స్‌‌‌‌ డెకాథ్లాన్‌‌‌‌లో మొత్తం 7976 పాయింట్లు సాధించిన శంకర్‌‌‌‌ మూడో ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. దాంతో డెకాథ్లాన్‌‌‌‌లో పతకం గెలిచిన తొలి ఇండియన్‌‌‌‌ అథ్లెట్‌‌‌‌గా శంకర్‌‌‌‌ రికార్డులకెక్కాడు. అలాగే కామన్వెల్త్‌‌‌‌లో శంకర్‌‌‌‌కు ఇది రెండో పతకం కావడం విశేషం. 2022 బర్మింగ్‌‌‌‌హామ్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో హైజంప్‌‌‌‌లో కాంస్యం నెగ్గాడు.  పోటీల ప్రారంభానికి ముందు మోకాలి సమస్య తిరగబెట్టడంతో ఈసారి హైజంప్‌‌‌‌ నుంచి తప్పుకోవడం శంకర్‌‌‌‌కు మైనస్‌‌‌‌గా మారింది. లిండన్‌‌‌‌ విక్టర్‌‌‌‌ (గ్రెనెడా, 8096), డామియన్‌‌‌‌ వార్నర్‌‌‌‌ (కెనడా, 8036) వరుసగా స్వర్ణం, రజతం గెలిచారు.


టీటీలో క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌

కామన్వెల్త్‌‌‌‌ టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌లో ఇండియా ప్లేయర్లు చరిత్ర సృష్టించారు. మెన్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ విభాగాల సెమీఫైనల్స్‌‌‌‌లో మొత్తం ఎనిమిది స్థానాలను ఇండియన్‌‌‌‌ ప్లేయర్లే దక్కించుకున్నారు. మెన్స్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో మానుష్‌‌‌‌ షా 11–6, 11–8, 2–11, 13–15, 11–8, 11–5తో ఆదిత్య సరీన్‌‌‌‌పై గెలిచాడు. పయాస్‌‌‌‌ జైన్‌‌‌‌ 8–11, 12–10, 12–14, 12–10, 11–6, 11–9తో హర్మీత్‌‌‌‌ దేశాయ్‌‌‌‌పై, అంకూర్‌‌‌‌ భట్టాచార్య 7–11, 15–13, 10–12, 11–5, 11–9, 11–9తో నికోలస్‌‌‌‌ వెన్‌‌‌‌ జెంగ్‌‌‌‌ లుమ్‌‌‌‌ (ఆస్ట్రేలియా)పై, మానవ్‌‌‌‌ ఠక్కర్‌‌‌‌ 5–11, 11–8, 13–11, 11–8, 11–6తో కానర్‌‌‌‌ అలెగ్జాండర్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ (ఇంగ్లండ్‌‌‌‌)పై గెలిచారు. విమెన్స్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో సిండ్రెల్లా దాస్‌‌‌‌ 10–12, 11–9, 12–10, 11–8, 7–11, 11–8తో యాంగ్‌‌‌‌జీ లియుపై, శ్రీజ ఆకుల 13–11, 11–4, 11–9, 12–10తో టిన్‌‌‌‌ టిన్‌‌‌‌ హో (ఇంగ్లండ్‌‌‌‌)పై, యశస్వి గోర్పడే 4–0తో కాన్‌‌‌‌స్టాంటినా సిహోజిస్‌‌‌‌ (ఆస్ట్రేలియా)పై గెలిచారు.