భారత్.. ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ యుద్ధ విమానాలు, మూడు స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాములను కొనుగోలు చేయాలని చూస్తోంది. ఈ ప్రతిపాదనలు రక్షణ మంత్రిత్వ శాఖ ముందు ఉన్నాయని, ఈ వారం ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా వీటి కొనుగోలు వివరాలు ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రపోజల్స్ ఓకే అయితే భారత నావికాదళానికి 22 సింగిల్-సీట్ రాఫెల్ మెరైన్ విమానాలతో పాటు నాలుగు ట్రైనర్ విమానాలు అందుబాటులోకి రానున్నాయి. దేశ భద్రత సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ యుద్ధ విమానాలు, జలాంతర్గాములను కొనాలని నౌకాదళం భావిస్తోంది. విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విక్రాంత్లు మిగ్29 లను నడుపుతున్నాయి.
మొత్తంగా వీటి డీల్స్ విలువ రూ.90,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే కాంట్రాక్టు చేపట్టిన తరువాతే పూర్తి ఖర్చుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భారత్ ఈ ఒప్పందంలో రాయితీలను కోరే అవకాశం ఉంది. గతంలో 36 యుద్ధ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లే రాఫెల్ డీల్కు సంబంధించి భారత్, ఫ్రాన్స్లు సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేసి ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనలు ఉన్నతాధికారుల దగ్గర ఉన్నాయి. మొత్తంగా అధునాతన రక్షణ విమానాలు అందుబాటులోకి వస్తే భారత్కు అదనపు బలం చేకూరనుంది.