ENG vs IND 2025: నిలకడగా రాహుల్, పంత్.. 150 పరుగులు దాటిన టీమిండియా ఆధిక్యం

ENG vs IND 2025: నిలకడగా రాహుల్, పంత్.. 150 పరుగులు దాటిన టీమిండియా ఆధిక్యం

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న లీడ్స్ టెస్ట్ ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు తొలి సెషన్ లో భారత్ నిలకడగా ఆడడంతో లంచ్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రాహుల్ (72), రిషబ్ పంత్ (31) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 పరుగులు కలుపుకొని 159 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. నాలుగో రోజు రెండో సెషన్ లో భారత్ జాగ్రత్తగా ఆడితే ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ పెట్టొచ్చు. దీంతో పంత్, రాహుల్ భాగస్వామ్యం కీలకం కానుంది. 

2 వికెట్ల నష్టానికి 90 పరుగులతో రెండో ఇన్నింగ్స్ లో నాలుగో రోజు తొలి సెషన్ ప్రారంభించిన భారత్ తొలి సెషన్ లో కేవలం ఒకటే వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ కు కెప్టెన్ శుభమాన్ గిల్ మరో రెండు పరుగులు జోడించి 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. కార్స్ వేసిన ఓవర్ లో ఆఫ్ సైడ్ షాట్ కట్ ఇద్దామని భావించిన గిల్.. టైమింగ్ మిస్సయ్యాడు. బ్యాట్ ఇన్ సైడ్ ఎడ్జ్ తగిలి బౌల్డయ్యాడు. దీంతో భారత్ 92 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఈ దశలో టీమిండియాను రాహుల్, పంత్ నిలబెట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి వీరిద్దరూ బాగా శ్రమించారు. రాహుల్ పూర్తిగా డిఫెన్స్ కు పరిమితం కాగా.. పంత్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో రాహుల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీ ఎంతో పట్టుదలగా బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ ప్రస్తుతం భారత్ చేతిలోనే ఉంది. రాహుల్, పంత్ నాలుగో వికెట్ కు అజేయంగా 60 పరుగులు జోడించారు. ఈ సెషన్ లో భారత్ రన్ రేట్ కేవలం 2.7 మాత్రమే ఉంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471.. ఇంగ్లాండ్ 465 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.