
న్యూఢిల్లీ: ఓవైపు తొలి టెస్ట్ గెలిచిన ఉత్సాహం.. మరోవైపు 36 ఏళ్లుగా ఈ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ ఓడిపోని రికార్డు.. ఈ నేపథ్యంలో ఇండియా.. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్కు రెడీ అయ్యింది. శుక్రవారం నుంచి అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్లా) స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా ఫేవరెట్గా దిగుతుంటే.. లెక్క సరిచేసేందుకు కంగారూలు ప్లాన్స్ వేస్తున్నారు. ప్రస్తుత ఫామ్, ఆట, స్టాట్స్ పరంగా చూస్తే ఈ మ్యాచ్ను కూడా ఇండియా మూడు రోజుల్లోనే ముగించే చాన్స్ కనిపిస్తున్నది. ఎందుకంటే తొలి టెస్ట్ మాదిరిగానే ఈ పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలమని తేలింది. ఇక టెస్ట్ స్టార్ చతేశ్వర్ పుజారాకు ఇది వందో మ్యాచ్ కావడంతో.. సెంచరీతో చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్నాడు.
సూర్య ఔట్.. శ్రేయస్ ఇన్!
ఈ మ్యాచ్ కోసం ఇండియా ఫైనల్ ఎలెవన్లో ఒకే ఒక్క మార్పు చేసే అవకాశం ఉంది. లోయర్ బ్యాక్ ఇంజ్యురీ నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్నెస్తో ఉంటే సూర్యకుమార్ ప్లేస్లో తుది జట్టులోకి రానున్నాడు. అయితే నెల రోజుల నుంచి కాంపిటీటివ్ క్రికెట్కు దూరంగా ఉన్న అయ్యర్.. ఉన్న ఫళంగా టెస్ట్ ఆడతాడా? లేదా? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఈ మార్పు మినహా.. మిగతా లైనప్ను యధావిధిగా కొనసాగించనున్నారు. అయితే టీమిండియా టాప్ ఆర్డర్ ఫామ్పై ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఓపెనింగ్లో కెప్టెన్ రోహిత్ అటాకింగ్ గేమ్తో దూసుకెళ్తున్నా.. రాహుల్, కోహ్లీ, పుజారా వైఫల్యం టీమ్ స్కోరుపై ప్రభావం చూపిస్తున్నది. ఈ ముగ్గురిలో కనీసం ఇద్దరైనా నిలబడితే భారీ స్కోరును ఆశించొచ్చు. గత మ్యాచ్లో జడేజా, అక్షర్ పటేల్ ఆదుకోవడంతో ఇండియా గట్టెక్కింది. ఇక తెలుగు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కోనా శ్రీకర్ భరత్ మెరవాల్సి ఉంది. స్పిన్ ఆల్రౌండర్లుగా జడేజా, అక్షర్తో పాటు అశ్విన్ కచ్చితంగా ప్రభావం చూపించనున్నాడు. పేసర్లుగా సిరాజ్, షమీ ప్లేస్లకు ఢోకా లేదు.
గెలుపే లక్ష్యంగా..
ఈ సిరీస్లో నిలవాలంటే ఆసీస్ ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలిచి తీరాలి. ఇందుకోసం కంగారూలు కూడా కొత్త ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. అయితే ఓపెనింగ్లో వార్నర్, ఖవాజ ఫామ్లో లేకపోవడంతో ఆసీస్ను దెబ్బకొడుతున్నది. ఈ ఇద్దరిలో ఒకర్ని తప్పించి కొత్త వారికి చాన్స్ ఇస్తారా? చూడాలి. టాప్ ఆర్డర్లో స్మిత్, లబుషేన్ భారీ స్కోర్లపై కన్నేశారు. హ్యాండ్స్కోంబ్, అలెక్స్ క్యారీ ఫర్వాలేదనిపిస్తున్నా.. రెన్ షా గాడిలో పడాల్సి ఉంది. ఒకవేళ కామెరూన్ గ్రీన్ కోలుకుంటే రెన్ షా ప్లేస్లో ఫైనల్ ఎలెవన్లోకి రావొచ్చు. బౌలింగ్లో బోలాండ్ ప్లేస్లో స్టార్క్ బరిలోకి దిగనున్నాడు. అతనికి తోడు కమిన్స్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు. అయితే ఈ మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించే సాహసం ఆసీస్ చేస్తుందా? చూడాలి. ప్రస్తుతానికి మర్ఫి, లైయన్కు తుది జట్టులో చోటు ఖాయం.