ఆరో రోజు అదరగొట్టిన భారత్.. గుల్వీర్, హర్జిందర్‌తో పతకాల వర్షం

ఆరో రోజు అదరగొట్టిన భారత్.. గుల్వీర్, హర్జిందర్‌తో పతకాల వర్షం

Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ 2026లో ఆరో రోజు భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో మెరిశారు. పురుషుల 10,000 మీటర్ల రేసులో భారత ఆర్మీ అథ్లెట్ గుల్వీర్ సింగ్ రజత పతకం (రన్నరప్) సాధించి చారిత్రాత్మక రికార్డు సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే ఈ విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. రేసు మొత్తం ఆధిక్యంలో ఉన్న ప్రధాన అథ్లెట్లతో కలిసి సాగిన గుల్వీర్, చివరికి 27:49.78 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి రజతం ఖాయం చేసుకున్నాడు.  

వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్జీందర్ సిల్వర్ సొంతం:
మహిళల 69 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో పంజాబ్‌కు చెందిన హర్జీందర్ కౌర్ రజత పతకంతో అదరగొట్టింది. స్నాచ్‌లో 101 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 126 కేజీలు చొప్పున మొత్తంగా తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా 227 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఆమె కామన్వెల్త్ గేమ్స్ స్నాచ్ రికార్డును రెండుసార్లు తిరగరాయడం విశేషం. 2022 బర్మింగ్‌హామ్ గేమ్‌లో సాధించిన కాంస్య పతకాన్ని ఈసారి రజతంగా అప్‌గ్రేడ్ చేసుకుంది.

రింగులో పంచ్‌ల వర్షం.. బాక్సింగ్‌లో మరో 3 పతకాలు:
భారత బాక్సింగ్ దళం పంచ్‌ల దూకుడు కొనసాగించింది. ముగ్గురు బాక్సర్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లి భారత్‌కు కనీసం కాంస్య పతకాలను ఖాయం చేశారు.

* మాడెంగ్‌బామ్ జాదుమణి సింగ్ (పురుషుల 55 కేజీలు): జాంబియా బాక్సర్‌పై విజయం సాధించి సెమీస్‌లోకి అడుగు పెట్టాడు. 

* ప్రీతి పవార్ (మహిళల 54 కేజీలు): నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన నికోల్ క్లైడ్‌ను 5–0 తేడాతో ఓడించింది.  

* ప్రియా ఘంగాస్ (మహిళల 60 కేజీలు): తొలి రౌండ్‌లో వెనుకబడినప్పటికీ అద్భుత కమ్‌బ్యాక్‌తో స్కాట్లాండ్ బాక్సర్‌పై విజయం సాధించి సెమీస్ చేరింది.  

* అయితే పర్వీన్ హుడా (65 కేజీలు), కపిల్ పోఖరియా (90 కేజీలు) క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ఇతర క్రీడల్లో మిశ్రమ ఫలితాలు: 
* అథ్లెటిక్స్: పురుషుల 400 మీటర్లలో విశాల్ టికే సెమీఫైనల్‌కు అర్హత సాధించగా, రాజేష్ రమేష్ విఫలమయ్యాడు. వర్షం కారణంగా ఇబ్బందికర పరిస్థితుల్లో జరిగిన మహిళల హైజంప్‌లో పూజా సింగ్ పతకం సాధించలేకపోయింది.  

* స్విమ్మింగ్: శ్రీహరి నటరాజ్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ సెమీఫైనల్ చేరినా కొద్దిపాటి తేడాతో ఫైనల్ చేరే అవకాశం కోల్పోయాడు. ఇక పారా స్విమ్మింగ్‌లో కార్తీక్ బుడిగిన (6వ స్థానం), అలీ ఇమామ్ (8వ స్థానం) 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైనల్‌లో ముగించారు.  

* లాన్ బౌల్స్: పురుషుల పెయిర్స్ విభాగంలో దినేష్ కుమార్, నవనీత్ సింగ్ జంట కుక్ ఐలాండ్స్‌పై విజయం సాధించింది.

పతకాల పట్టికలో భారత్ పొజిషన్: 
ఆరో రోజు ముగిసే సమయానికి భారత జట్టు 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలతో మొత్తం 12 పతకాలు సాధించి పతకాల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా జట్టు 35 స్వర్ణాలతో సహా మొత్తం 80 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.