ముంబై: యూఏఈ వేదికగా జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్కప్లో బరిలోకి దిగే టీమిండియాలో ఎవరెవరుంటారు.. ? కుర్రాళ్లకు చాన్స్ ఇస్తారా.. లేదంటే సీనియర్లు, జూనియర్లతో సమతూకంగా జట్టును ఎంపిక చేస్తారా? భుజం గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇస్తాడా.. శిఖర్ ధవన్, పృథ్వీ షాతోపాటు లంక టూర్లో హిట్అయిన యంగ్స్టర్స్ సంగతేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొన్ని గంటల్లో సమాధానం దొరికే చాన్స్ కనిపిస్తోంది. టీ20 వరల్డ్కప్ బరిలోకి దిగే జట్టును ఎంపిక చేసేందుకు చేతన్ శర్మ నేతృత్వంలోని ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ బుధవారం సమావేశం కానుందని సమాచారం. ప్రస్తుతం ఇంగ్లండ్లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితోపాటు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ, సెలెక్షన్ కమిటీ కన్వీనర్ జై షా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. విరాట్, శాస్త్రి వర్చువల్గా హాజరవుతారు. యూఏఈ వేదికగా అక్టోబర్ 23 నుంచి టీ20 వరల్డ్కప్ (సూపర్ 12 రౌండ్) మొదలవ్వనుంది. ఇందుకోసం 15 మంది ప్లేయర్లతో కూడిన ప్రధాన జట్టుతోపాటు ట్రావెలింగ్ రిజర్వ్లను ఎంపిక చేయాల్సి ఉంది. కాగా, మెగా టోర్నీ బరిలోకి దిగే ప్రధాన జట్టు ఆల్రెడీ డిసైడ్ అయ్యిందని, బుధవారం తుది నిర్ణయం మాత్రమే తీసుకుంటారని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
పోటీ ఎక్కువే..
ఐపీఎల్, శ్రీలంక టూర్ పుణ్యమాని ఈసారి టీ20 వరల్డ్కప్ బెర్త్ల కోసం ఎదురుచూస్తున్న వాళ్ల లిస్ట్ పెద్దగానే ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, బుమ్రా, షమీ, భువనేశ్వర్, రిషబ్ పంత్, యుజ్వేంద్ర చహల్ ప్రస్తుతానికి డైరెక్ట్ ఎంట్రీలుగా కనిపిస్తున్నారు. వీరి బ్యాకప్లతోపాటు మిగిలిన ప్లేస్ల విషయంలో సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఓపెనింగ్ స్లాట్ విషయంలో రోహిత్ పార్ట్నర్గా కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ రేసులో ఉన్నారు. టీ20ల్లో ఓపెనింగ్ చేస్తానని గతంలో విరాట్ ప్రకటించడంతో ఈ రేసు హీట్ పెరిగింది. రాహుల్, ధవన్లో సెలెక్టర్లు ఎవరికి ఓటేస్తారో చూడాలి. లంక టూర్లో సక్సెస్ అయిన పృథ్వీ షా పేరు కూడా పరిశీలనలోకి రావొచ్చు. ఇక, గాయం నుంచి కోలుకొని ఐపీఎల్కు రెడీ అవుతున్న శ్రేయస్ అయ్యర్కు తిరిగి జట్టులో చోటిస్తారో లేదో చూడాల్సి ఉంది. మిడిలార్డర్ బెర్తుల కోసం సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే రేసులో ఉన్నారు. రిషబ్ పంత్కు బ్యాకప్గా ఇషాన్ కిషన్ ఎంపిక లాంఛనంగా కనిపిస్తుండగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్ ఆసక్తి రేపుతోంది. సుందర్ స్థానాన్ని భర్తీ చేయాల్సి వస్తే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, జయంత్ యాదవ్ పేర్లను పరిశీలించొచ్చు. ఇక, లెగ్గీ యుజ్వేంద్ర చహల్ ప్లేస్ ఖాయం కాగా..మరో ప్లేస్ కోసం యంగ్స్టర్స్ వరుణ్ చక్రవర్తి, రాహుల్ చహర్ మధ్య పోటీ ఉంది. పేస్ కోటాలో బుమ్రా, షమీ, భువనేశ్వర్, దీపక్ చహర్ డైరెక్ట్ ఎంట్రీలు కాగా శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్లో ఇద్దరికి చాన్సు కనిపిస్తోంది. లెఫ్టార్మ్ పేసర్ కావాలనుకుంటే చేతన్ సకారియా, నటరాజన్ పేర్లు కూడా పరిశీలనకు రావొచ్చు.
టీమ్ ఇలా ఉండొచ్చు: (ట్రావెల్ రిజర్వ్స్ తో కలిపి): కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్, పంత్, హార్దిక్, జడేజా, సూర్యకుమార్, బుమ్రా, షమీ, భువనేశ్వర్, చహల్, దీపక్ చహర్, ధవన్, ఇషాన్, సుందర్, రాహుల్ చహర్, సకారియా, శార్దూల్, ఉమేశ్, వరుణ్ చక్రవర్తి, క్రునాల్, పృథ్వీ షా.