
వెలుగు స్పోర్ట్స్ డెస్క్: పదేండ్లుగా ఒక్క ఐసీసీ ట్రోఫీ నెగ్గని టీమిండియా సొంతగడ్డపై అక్టోబర్ 5 నుంచి జరిగే వన్డే వరల్డ్ కప్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. చివరగా 2011లో స్వదేశంలోనే వరల్డ్కప్ గెలిచిన ఇండియా... పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరిగే టోర్నీలో విజేతగా నిలవాలని కోరుకుంటోంది. ఎప్పుడో రావాల్సిన ఈ టోర్నీ షెడ్యూల్ను ఆతిథ్య బీసీసీఐ, ఐసీసీ ఎట్టకేలకు మంగళవారం రిలీజ్ చేయగా.. దానిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. వరల్డ్కప్ మ్యాచ్లకు పది స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనుండగా.. హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది వేదికల్లో ఇండియా ఒక్కో మ్యాచ్ ఆడనుంది. టోర్నీకి ముందు రెండు నగరాల్లో రెండు ప్రాక్టీస్ మ్యాచ్ల్లో పాల్గొంటుంది. టోర్నీలో పోటీపడే మరే జట్టు ఇన్ని ఎక్కువ వేదికల్లో ఆడటం లేదు. మరోవైపు ఇండియా మ్యాచ్ లేదని హైదరాబాద్, అసలు వరల్డ్ కప్ ఆతిథ్య అవకాశమే లేదని పంజాబ్ తదితర క్రికెట్ అసోసియేషన్లు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, వరల్డ్ కప్లో ఒక్కో లీగ్ మ్యాచ్ను ఒక్కో చోట ఆడటం టీమిండియాకు సవాల్ కానుంది. మిగతా జట్లు కనీసం ఒక్క సిటీలో అయినా రెండేసి మ్యాచ్లు ఆడనుండగా.. ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా కలుపుకుంటే రోహిత్సేన 43 రోజుల్లో 11 వేర్వేరు నగరాల్లో 11 వన్డేలు ఆడనుంది. చూడ్డానికి సింపుల్గానే కనిపిస్తున్నా.. ఆయా నగరాలకు ప్రయాణించడం, కుదురుకోవడం ఆటగాళ్లకు తలకు మించిన భారం కానుంది. మెగా టోర్నీలో వామప్స్, లీగ్ దశలోనే టీమిండియా విమానాల్లో 12 వేల పైచిలుకు కిలోమీటర్లు జర్నీ చేయనుంది.
మూడ్రోజులకో ఫ్లైట్..
సెప్టెంబర్30 ఇంగ్లండ్తో తొలి వామప్ మ్యాచ్ గువాహతిలో ఆడనున్న ఇండియా... క్వాలిఫయర్ టీమ్తో రెండో వామప్ (అక్టోబర్3న) కోసం అక్కడి నుంచి త్రివేండ్రం వెళ్లేందుకు 2506 కి.మీ ట్రావెల్ చేయాలి. ఆపై త్రివేండ్రం నుంచి ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ కోసం చెన్నై (621 కిమీ)కి, చెన్నై నుంచి ఢిల్లీ (1761 కిమీ, అఫ్గానిస్తాన్తో మ్యాచ్)కి, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ (775 కిమీ, పాకిస్తాన్తో)కు, అహ్మదాబాద్ నుంచి పుణె (518 కిమీ, బంగ్లాదేశ్తో)కు, పుణె నుంచి ధర్మశాల (1543 కిమీ, న్యూజిలాండ్తో)కు వెళ్లనుంది. అనంతరం ధర్మశాల నుంచి లక్నో (748 కిమీ, ఇంగ్లండ్తో), లక్నో నుంచి ముంబై (1190 కిమీ, క్వాలిఫయర్2తో), ముంబై నుంచి కోల్కతా (1652 కిమీ, సౌతాఫ్రికాతో), కోల్కతా నుంచి బెంగళూరు (1560 కిమీ, క్వాలిఫయర్1తో) ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఏరియల్ డిస్టెన్స్ 12,874 కి.మీ. ఇక, టీమిండియా మ్యాచ్ల షెడ్యూల్ను పరిశీలిస్తే జట్టు మూడ్రోజులకు ఒక ఫ్లైట్ ఎక్కనుంది. పైగా, మ్యాచ్ల మధ్య ఎక్కువ గ్యాప్ కూడా లేదు. ఇంగ్లండ్, క్వాలిఫయర్1తో చివరి మ్యాచ్లకు ముందు మాత్రమే నాలుగు రోజుల కంటే ఎక్కువ బ్రేక్ లభించనుంది.
ప్లేయర్ల పెర్ఫామెన్స్పై ప్రభావం!
ఈ టోర్నీలో ఇండియా కనీసం సెమీఫైనల్ చేరుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రోహిత్సేన సెమీస్ కోసం బెంగళూరు నుంచి ముంబైకి మరో 842 కి.మీ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. టీమిండియా ఫైనల్లో అడుగు పెడితే నవంబర్ 19న మెగా ఫైనల్ జరగనున్న అహ్మదాబాద్కు ఇంకో 441 కి.మీ. ప్రయాణించాలి. ఈ లెక్కన సొంతగడ్డపై వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్ ఆడాలంటే 13సిటీల మీదుగా మొత్తం 14 వేల కి.మీ.లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆడేది స్వదేశంలోనే అయినా ఒక్కో నగరంలో వాతావరణం, పరిస్థితులు ఒక్కోలా ఉంటాయి. ఆటగాళ్ల పెర్ఫామెన్స్పై అవి కూడా ప్రభావం చూపుతాయి. ఏదేమైనా వన్డే వరల్డ్ కప్లో టీమిండియా ముచ్చటగా మూడోసారి విజేతగా నిలవాలంటే ఆటగాళ్లు మైదానంలో ప్రత్యర్థులనే కాకుండా ఇలాంటి మరెన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.