- ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం
సైఫాబాద్, వెలుగు: అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ తాను లోకల్ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఇటీవల నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రాలో హౌసింగ్ బోర్డు అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.
హైదరాబాద్ ఆదర్శ్నగర్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడతలో ఖైరతాబాద్ నియోజకవర్గానికి 480 ఇళ్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం 120 ఇండ్లే కేటాయించారని దానం నాగేందర్ తెలిపారు.
మిగిలిన 360 ఇళ్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. తాను కార్యక్రమానికి హాజరయ్యేలోపే డ్రా నిర్వహించి, నియోజకవర్గానికి సంబంధం లేని వారికి ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. హౌసింగ్ బోర్డు ఎండీ గౌతమ్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందని విమర్శించారు.
పాతబస్తీలో ఇలా వ్యవహరిస్తే అక్కడి ఎమ్మెల్యేలు అధికారులపై దాడులకు దిగేవారని వ్యాఖ్యానించారు. గతంలో ఓ అధికారితో దురుసుగా వ్యవహరించిన ఘటనలో తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేశారు.
మరోసారి అలాంటి పరిస్థితికి తనను దిగజార్చొద్దని అధికారులను హెచ్చరించారు. హౌసింగ్ బోర్డు ఎండీ వ్యవహారంపై సీఎం రేవంత్రెడ్డికి ఫిర్యాదు చేస్తానని, ఈ అంశాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావిస్తానని దానం నాగేందర్ తెలిపారు.
