- నిందితులను పట్టుకున్న పోలీసులు
నేరడిగొండ, వెలుగు: అక్రమంగా ఆవులను తరలిస్తున్న లారీని పోలీసులు వెంబడించారు. అయితే పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన నిందితులను గ్రామస్తుల సహకారంతో పట్టుకున్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో జరిగింది. పక్కా సమాచారంతో ఆదిలాబాద్ నుంచి నేరడిగొండ వైపు ఆవులతో వెళ్తున్న లారీని కుప్టీ ఘాట్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. కానీ, డ్రైవర్ లారీని ఆపకుండా వేగంగా దూసుకెళ్లాడు.
నేరడిగొండ పోలీస్ స్టేషన్ సమీపంలో నిలిపేందుకు ప్రయత్నించగా.. రాంగ్ రూట్ లో వెళ్లి తప్పించుకున్నాడు. దీంతో పోలీసులు వెంబడించి ఆరేపల్లి సమీపంలో అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. డివైడర్ పైనుంచి పోనిచ్చే క్రమంలో లారీ ఇరుక్కుపోయింది. దీంతో డ్రైవర్, మరో ఇద్దరు వ్యక్తులు లారీని వదిలేసి అడవిలోకి పారిపోయారు.
బోరిగాం శివారులో వారిని రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న 47 ఆవులను స్వాధీనం చేసుకొని గోశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
