- హైదరాబాద్లోని సీసీఎల్ఏ ప్రాంగణంలో నిరసన
హైదరాబాద్, వెలుగు: సీపీఎస్(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను వెంటనే రద్దు చేయించి..ఓపీఎస్(ఓల్డ్ పెన్షన్ స్కీమ్)ను పునరుద్ధరణ చేసుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ పేర్కొన్నారు.సెప్టెంబరు1 సీపీఎస్ విద్రోహ దినంగా పాటిస్తూ మంగళవారం హైదరాబాద్లోని సీసీఎల్ఏ ప్రాంగణంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ మాట్లాడారు. ఉద్యోగుల భవిష్యత్తు, వారి కుటుంబాల ఆర్థిక భద్రత, ఆత్మగౌరవం కోసమే తాము పోరాడుతున్నామని గుర్తుచేశారు. 2004 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సీపీఎస్ కారణంగా పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి పెన్షన్కు అభద్రత ఏర్పడిందన్నారు.
సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలనేదే ఉద్యోగుల నినాదం కావాలన్నారు. సీపీఎస్పై ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. 2004కు ముందు నోటిఫికేషన్ వెలువడి, వివిధ కారణాల వల్ల ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు కూడా ఓపీఎస్ ప్రయోజనం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ఉద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కుమారస్వామి, సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దర్శన్గౌడ్, ఇంటర్మీడియెట్ బోర్డు అసోసియేషన్ అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, టీఏపీయూఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
