హైదరాబాద్, వెలుగు: ‘సర్’ ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉన్న 73 లక్షల మంది ఓటర్ల ఇళ్లకు బీఎల్ఓలు వెళ్లి రీ వెరిఫికేషన్ చేయాలని పీసీసీ ఎన్నికల సంఘం కోరింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేనందున.. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు తెలిపేందుకు ఇచ్చిన గడువును పొడిగించాలని పీసీసీ రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్ రాజేశ్ కోరారు. ఈ నెల 16 నుంచి అక్టోబర్ 16 వరకు కనీసం నెల రోజుల పాటు సమయం ఇవ్వాలన్నారు. అలాగే ఫారం-6, 7, 8లు బీఎల్ఓల వద్ద తగినన్ని అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
