నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెప్టెంబర్ 3న మహాధర్నా నిర్వహిస్తున్న వేళ, పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. అయితే, దీనికి కౌంటర్గా కాంగ్రెస్ శ్రేణులు రంగంలోకి దిగాయి. పదేళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలు.. 1000 రోజుల్లో కాంగ్రెస్ వికాసం పేరుతో భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి.
పదేళ్ల తమ పాలనలో నల్లగొండ జిల్లా ప్రాజెక్టులను బీఆర్ఎస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీల ద్వారా తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో... రేపు కాంగ్రెస్ శ్రేణులు ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేయనున్నట్లు సమాచారం. ఈ ఫ్లెక్సీల రగడతో మిర్యాలగూడ రాజకీయాలు మరింత రంజుగా మారాయి.
