- కాలిమంతన్’ను అధికారికంగా ప్రకటించిన ప్రెసిడెంట్ జొకో
- జకార్తా ముంపు ప్రమాదంతో తప్పని తరలింపు
జకార్తా: ఇండోనేసియా కొత్త రాజధానిని ‘ఈస్ట్ కాలిమంతన్’ రాష్ట్రంలో నిర్మించనున్నట్లు ప్రెసిడెంట్ జొకో విడొడో తెలిపారు. కేపిటల్ను జకార్తా నుంచి కాలిమంతన్కు మార్చబోతున్నట్లు గత వారం అధికారికంగా ప్రకటించిన ఆయన.. దాని లొకేషన్, ప్రాజెక్టు అంచనాల్ని సోమవారం పార్లమెంట్లో వెల్లడించారు. ఇండోనేసియాలో అతి పెద్ద దీవిగా ఉన్న కాలిమంతన్లో ఐదు రాష్ట్రాలుండగా, ఈస్ట్ కాలిమంతన్ పేరును ఖరారు చేశారు. ఇక్కడి సమరిండా, బాలిక్పాపన్ సిటీల మధ్య సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో కొత్త రాజధాని కడతామన్న ప్రెసిడెంట్ జొకో.. ప్రకృతి విపత్తుల ముప్పు తక్కువగా ఉన్నందునే ఈస్ట్ కాలిమంతన్ స్టేట్ను ఎంపిక చేశామన్నారు. కొత్త కేపిటల్ నిర్మాణానికి (ఇండోనేసియా రుపియా)466 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారు. ‘‘పెద్ద రాజ్యాల్లో ఒకటిగా,74 ఏండ్లుగా స్వతంత్ర దేశంగా ఉన్న ఇండోనేసియా ఇప్పటిదాకా తన రాజధానిని సొంతగా ఎన్నుకోలేదు. పైగా గవర్నెన్స్తోపాటు బిజినెస్, సర్వీసులకు కేంద్రంగా ఉన్న జకార్తాపై రోజురోజుకూ భారం పెరిగిపోతున్నది’’అని ప్రెసిడెంట్ వివరించారు. కొత్త రాజధాని కోసం అడవుల్ని నరికేయాల్సి వస్తుండటంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో పెద్ద దీవి జావాలో ఉన్న జకార్తా సిటీ పదేండ్లలో 3 మీటర్లు నీళ్లలో మునిగిపోయింది. వాతావరణ మార్పులు, గ్రౌండ్ వాటర్ను విపరీతంగా తోడేయడం ఇలాగే కొనసాగితే మరో 30 ఏండ్లలో జకార్తాలో మూడో వంతు మునిగిపోవడం ఖాయమని సైంటిస్టులు చెప్పారు. జకార్తాలోని కోటి మందికి తోడు సబర్బన్లో మరో 40 లక్షల మంది నివసిస్తున్నారు. దీంతో నీళ్ల కొరత, మంత్రులు, గవర్నర్లు కూడా ఫ్రీగా ఆఫీసులకు వెళ్లలేనంతగా ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. డెవలప్మెంట్ మొత్తం జకార్తా చుట్టుపక్కలే జరగడంతో దేశంలోని మిగతా ప్రాంత వాసుల్లో రోజురోజుకూ అసంతృప్తి పెరుగుతోంది. కొత్త రాజధాని ఏర్పాటుతో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పాలకులు భావిస్తున్నారు.