కేసీఆర్ మీటింగ్‌కు ఇంద్రకరణ్ డుమ్మా

కేసీఆర్ మీటింగ్‌కు ఇంద్రకరణ్ డుమ్మా
  • బీఆర్‌‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం 

నిర్మల్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌‌ఎస్ నిర్వహించిన కీలక సమావేశానికి నిర్మల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డుమ్మాకొట్టారు. ఆయనతో పాటు ముధోల్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి కూడా గైర్హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రివ్యూ మీటింగ్‌కు గైర్హాజరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనారోగ్య కారణాల వల్లే వారు మీటింగ్‌కు రాలేదని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కేసీఆర్‌‌కు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధినేత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇంద్రకరణ్‌ రెడ్డికి నచ్చజెప్పాలంటూ స్థానిక నేతలకు సూచించినట్లు సమాచారం. గురువారం హైదరాబాద్‌లోని కేసీఆర్‌‌ నివాసంలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై జరిగిన రివ్యూ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశానికి హాజరైన హరీశ్ రావు .. జిల్లా నేతలతో ఇంద్రకరణ్ రెడ్డి వ్యవహారంపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ మారే విషయమై ఇప్పటివరకు ఇంద్రకరణ్ రెడ్డి ఎక్కడా బయటపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారం రోజుల క్రితం నిర్మల్‌లో కొంతమంది సీనియర్ నాయకులతో ఆయన మాట్లాడి, వారి అభిప్రాయాలను తీసుకున్నారు కానీ, తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. 

వ్యూహాత్మకంగా అడుగులు..

కాంగ్రెస్‌లో చేరే విషయమై ఇంద్రకరణ్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదని కొంత మంది పార్టీ నాయకులు అంటున్నారు. రెండు మూడ్రోజుల్లో ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్‌కు వచ్చి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో కార్యకర్తల చేత పార్టీ మారాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చి, వారి నిర్ణయం మేరకు తాను పార్టీ మారబోతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.