ఇన్ఫోసిస్​ లాభం 8 శాతం పెరిగినా...అంచనాలు అందుకోలే

ఇన్ఫోసిస్​ లాభం 8 శాతం పెరిగినా...అంచనాలు అందుకోలే

బెంగళూరు : ఇన్ఫోసిస్​ నికర లాభం కిందటేడాది నాలుగో క్వార్టర్​తో పోలిస్తే తాజా క్వార్టర్లో 8 శాతం పెరిగింది. మార్చి 2023 క్వార్టర్లో నికర లాభం రూ. 6,128 కోట్లకు చేరినట్లు గురువారం నాడు కంపెనీ వెల్లడించింది. ఇదే క్వార్టర్లో రెవెన్యూ 16 శాతం అధికమై రూ. 37,441 కోట్లుగా నమోదయినట్లు పేర్కొంది. కానీ, ఎనలిస్టుల అంచనాలు అందుకోవడంలో ఇన్ఫోసిస్​ విఫలమైంది. కంపెనీ రెవెన్యూ రూ. 38,550 కోట్లు, నికర లాభం రూ. 6,550 కోట్లు ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. సెక్వెన్షియల్​గా చూసినప్పుడు మార్చి క్వార్టర్లో కంపెనీ నికర లాభం 7 శాతం, రెవెన్యూ 2.3 శాతం తగ్గిపోయాయి. మార్చి 2023 క్వార్టర్లో ఆపరేటింగ్​ మార్జిన్​ సైతం 50 బేసిస్​ పాయింట్లు తగ్గి సెక్వెన్షియల్​గా 21 శాతంగా రికార్డయింది.మార్చి 2023 క్వార్టర్లో ఇన్ఫోసిస్​ 2.1 బిలియన్​ డాలర్ల విలువైన టీసీవీ డీల్​దక్కించుకుంది. ఇక మొత్తం ఏడాదిలో 9.8 బిలియన్​ డాలర్ల విలువైన డీల్స్​ను చేజిక్కించుకుంది. గురువారంనాటి బోర్డు మీటింగ్​లో డైరెక్టర్లు ఒక్కో షేర్​కు  రూ. 17.50 చొప్పున ఫైనల్​ డివిడెండ్​ను రికమెండ్​ చేశారు. 

గైడెన్స్​ నిరాశాజనకం...

2023–24 ఫైనాన్షియల్​ ఇయర్లో రెవెన్యూ గ్రోత 4–7 శాతం మాత్రమే ఉండొచ్చని ఇన్ఫోసిస్​ గైడెన్స్​ ఇచ్చింది. అంటే, ఓవర్​సీస్​ బిజినెస్​సవాళ్లు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. రాబోయే ఫైనాన్షియల్​ ఇయర్లో ఆపరేటింగ్​ మార్జిన్​ 20–22 శాతం మేర ఉండొచ్చని కూడా ఇన్ఫోసిస్​ ప్రకటించింది. పరిస్థితులలో వచ్చిన మార్పుల కారణంగా, క్లయింట్లు ఎక్కువ ఎఫిషియన్సీని తక్కువ ఖర్చుతో కోరుకుంటున్నారని ఇన్ఫోసిస్​ ఎండీ సలీల్​ పరేఖ్​ చెప్పారు. దీంతో లార్జ్​ డీల్స్​​పైప్​లైన్ పటిష్టంగా మారిందని పేర్కొన్నారు. 2022–23 పూర్తి ఫైనాన్షియల్​ ఇయర్​కు ఇన్ఫోసిస్​ రెవెన్యూ 15.4 శాతం పెరిగింది. ఇది కంపెనీ ఇచ్చిన గైడెన్స్​ రేంజ్​ 16–16.50 శాతం కంటే తక్కువ కావడం గమనించదగ్గది. రెవెన్యూ గైడెన్స్​ అందుకోవడంలో ఫెయిలైన కంపెనీ ఆపరేటింగ్​ మార్జిన్​ టార్గెట్​ మాత్రం అందుకోగలిగింది. ఖర్చు తగ్గించుకుని, ఆపరేషనల్​ ఎఫిషియెన్సీ పెంచుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. 

సెగ్మెంట్​వారీగా....

మార్చి క్వార్టర్లో ఫైనాన్షియల్​ సర్వీసెస్​ సెక్టార్​ బిజినెస్​పై గట్టి దెబ్బే పడింది. ఈ వెర్టికల్​ రెవెన్యూ 1.7 శాతం తగ్గిపోయింది. కంపెనీ మొత్తం రెవెన్యూలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్​ సర్వీసెస్​ సెక్టార్​ రెవెన్యూ 26 శాతం​దాకా ఉంటోంది. ఇక కమ్యూనికేషన్ వెర్టికల్​ రెవెన్యూ సైతం 2 శాతం పడిపోయింది. మరోవైపు మాన్యుఫాక్చరింగ్​ వెర్టికల్​ ​ 22 శాతం, ఎనర్జీ అండ్​ లైఫ్​సైన్సెస్​ వెర్టికల్స్​ ...రెండూ 14 శాతం చొప్పున గ్రోత్​ సాధించాయి.  

నార్త్​ అమెరికా బిజినెస్​ గ్రోత్​ 5.7 శాతం ....

జాగ్రఫికల్​గా చూస్తే నార్త్​ అమెరికా బిజినెస్​ 5.7 శాతం, యూరప్​ బిజినెస్​ 14 శాతం పెరగ్గా, దేశీయ రెవెన్యూ 13 శాతం తగ్గిపోయింది. 100 మిలియన్​ డాలర్ల బాస్కెట్లో ఇద్దరు కొత్త క్లయింట్లను సంపాదించామని, దీంతో మొత్తం క్లయింట్ల సంఖ్య 40 కి పెరిగిందని ఇన్ఫోసిస్​ వెల్లడించింది. టాప్​ 5 క్లయింట్ల నుంచి  మొత్తం రెవెన్యూలో 13 శాతం వచ్చిందని, టాప్​ 10 క్లయింట్ల నుంచి మొత్తం రెవెన్యూలో 20 శాతం సమకూరిందని కంపెనీ తెలిపింది. డిసెంబర్​ 2022 క్వార్టర్​తో పోలిస్తే మార్చి 2023 క్వార్టర్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. డిసెంబర్ క్వార్టర్లో కంపెనీకి 3,46,845 మంది ఉద్యోగులుండగా, మార్చి 2023 క్వార్టర్లో ఈ సంఖ్య 3,43,234 కి పడిపోయింది. మార్కెట్​ పరిస్థితులు పూర్తి ఆశాజనకంగా లేకపోవడంతో ఈ ఏడాది కొత్త ఉద్యోగాల గురించి కంపెనీ ప్రస్తావించలేదు.