కుత్బుల్లాపూర్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్చి గాగిల్లాపూర్లో సుశీలమ్మ(70) అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. తన ఇంట్లోనే సోఫాపై రక్తపు మడుగులో ఆమె మృతదేహం పడి ఉంది. సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణం తెలియలేదు. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం కోసం దొంగలు ఇంతకు తెగించారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారం, వెండి ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో పట్ట పగలే రెచ్చిపోతున్న దొంగలు.. అడ్డొస్తే హత్య చేసేందుకూ వెనుకాడడం లేదు.
ముఖ్యంగా ఒంటరి, వృద్ధ మహిళలను టార్గెట్చేసి చంపి మరీ బంగారం ఎత్తుకెళ్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా తెలిసినవాళ్లే ఘాతుకాలకు పాల్పడుతున్నారు. సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కనీసం 30కిపైగా చైన్స్నాచింగ్లు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో తాజాగా బంగారం కోసం ఓ వృద్ధురాలిని హత్యచేయడం కలకలం రేపింది. దీంతో ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండాలని, ప్రస్తుతం జరుగుతున్న జాతరలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారు నగలు వేసుకొని వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి. దీంతో ఒంటిపై బంగారం వేసుకొని బయటకు వెళ్లేందుకు మహిళలు జంకుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సంక్రాంతి తర్వాత 8 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. ఎల్బీనగర్, చైతన్యపురి, హయత్నగర్ కుంట్లూరులో గంట వ్యవధిలోనే మూడు చోట్ల మహిళల మెడలోంచి గొలుసులు, పుస్తెల తాళ్లు తెంపుకెళ్లారు. సింద్రాబాద్ గోపాలపురంలో పల్సర్ బైక్ను చోరీ చేసిన ఇద్దరు దొంగలు ముఖానికి మాస్కులు ధరించి వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సిటీలో రాత్రి పూట షాపింగ్కు వెళ్లి వస్తున్న, కాలనీ రోడ్లపై నడుస్తున్న ఒంటరి మహిళలతోపాటు బైక్ వెనుక కూర్చున్న వారిని కూడా చైన్స్నాచర్లు వదలట్లేదు.
