ఫీజుల దందాపై మళ్లీ ఎంక్వైరీ

ఫీజుల దందాపై మళ్లీ ఎంక్వైరీ

నలుగురు జాయింట్ డైరెక్టర్లతో కమిటీ

గత విచారణపై స్పష్టత రాకపోవడంతో నిర్ణయం

ఈనెల 20 లోగా రిపోర్టు ఇవ్వనున్న కమిటీ

హైదరాబాద్, వెలుగు: రూల్స్ కు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ మరోసారి ఎంక్వైరీ మొదలుపెట్టింది. నలుగురు జాయింట్ డైరెక్టర్ల (జేడీ)తో కూడిన కమిటీ ఈ పని ప్రారంభించింది. రాష్ర్టంలో కరోనా నేపథ్యంలో ప్రైవేటు స్కూల్స్ కేవలం ట్యూషన్​ఫీజులు మాత్రమే పేరెంట్స్ నుంచి తీసుకోవాలని, గతేడాది ఉన్న ఫీజులనే ఈసారి తీసుకోవాలని, అది కూడా ప్రతినెల వసూలు చేయాలని ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ జీవోను చాలా స్కూళ్లు పట్టించుకోలేదు. ఇష్టానుసారంగా ఫీజులు పెంచడంతో పాటు ఒకేసారి మొత్తం ఫీజులను పేరెంట్స్​నుంచి వసూలు చేశాయి. దీనిపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. హైకోర్టు దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోయారు.

క్లారిటీ రాలేదని..

ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రెండు నెలల కిందట సుమారు 50 స్కూళ్లకు నోటీసులు ఇచ్చారు. ఇద్దరు జేడీ స్థాయి అధికారులతో విచారణ చేయించారు. అయితే ఈ ఎంక్వైరీలో స్పష్టత రాలేదు. దీంతో తాజాగా ఐదు రోజుల కిందట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 11 సీబీఎస్ఈ సిలబస్ స్కూళ్లలో మరోసారి విచారణ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు. దీనికోసం జాయింట్ డైరెక్టర్లు సోమిరెడ్డి, రాజేశ్, రమేశ్, సత్యనారాయణరెడ్డితో కమిటీని వేశారు. ఈనెల 7 లోగా రిపోర్టు ఇవ్వాలని డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశాలు జారీ చేశారు. అయితే సమగ్ర విచారణకు మరో పదిరోజుల సమయం కావాలని జేడీలు కోరారు. ఈ మేరకు ఈనెల 20 లోపు రిపోర్టును స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్​కు కమిటీ అందించనుంది. ఇప్పటికే పలు స్కూళ్లకు సంబంధించిన రికార్డులను డీఈఓలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని జేడీలు పరిశీలిస్తున్నారు. అయితే రాష్ర్టంలోని స్టేట్​సిలబస్ స్కూళ్లలో ఏ ఒక్క స్కూల్ కూడా రూల్స్ ఉల్లంఘించలేదని అధికారులు చెప్తుండటం గమనార్హం.

11 స్కూళ్లు ఇవే

మౌంట్ లిటేరా జీ స్కూల్, మెరీడియన్ స్కూల్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, గీతాంజలి పబ్లిక్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, నారాయణ హైస్కూల్ –డీడీ కాలనీ, కల్పస్కూల్, సెయింట్ ఆండ్రూస్–సికింద్రాబాద్, సెయింట్ ఆండ్రూస్–మేడ్చల్, ఆక్స్​ఫర్డ్ గ్రామర్ స్కూల్–హిమాయత్ నగర్, నీరజ్ పబ్లిక్ స్కూల్–అమీర్ పేట.

For More News..

తెలంగాణలో కొత్తగా 1,891 కరోనా కేసులు

టీఆర్పీ రేటింగ్ కోసం ఇంటికి రూ.500 ఇస్తున్న టీవీ చానల్

ఆస్తుల ఆన్​లైన్‌లో​ సర్వర్​ డౌన్​.. ఆసక్తి చూపని ఓనర్లు