పైసలు వసూలు చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టని అధికారులు

పైసలు వసూలు చేసి ఇన్సూరెన్స్  ప్రీమియం కట్టని అధికారులు

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం మరో నిర్వాకం బయటపడింది. ఇన్సూరెన్స్ పేరుతో మేనేజ్ మెంట్ భారీ కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్ 1న ఇన్స్యూరెన్స్ పేరుతో అధికారులు ఒక్కో విద్యార్థి నుంచి రూ.700 చొప్పున వసూలు చేశారు. అయితే ఇన్స్యూరెన్స్ ప్రీమియం మాత్రం కట్టలేదు. ఇటీవల పుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందిన విద్యార్థి సంజయ్ కిరణ్ తో పాటు అనారోగ్యానికి గురైన  స్టూడెంట్స్ పేరెంట్స్ నిలదీయడంతో నిర్లక్ష్యం బయటపడింది. ఇన్సూరెన్స్ చెల్లించలేదన్న విషయాన్ని  డైరెక్టర్ నిర్థారించారు. విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీయడంతో ట్రిపుల్ ఐటీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం ఇన్స్యూ రెన్స్ పేరిట విద్యార్థుల నుంచి ఏటా దాదాపు రూ.56 నుంచి 60 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రీమియం చెల్లింపు విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అధికారుల వైఖరి కారణంగా ఈ మధ్యనే ఫుడ్ పాయిజన్ కారణంగా చనిపోయిన స్టూడెంట్ సంజయ్ కిరణ్ తో పాటు అనారోగ్యానికి గురైన విద్యార్థులు ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేక నష్టపోయారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం ఇన్నేళ్లుగా ఇన్స్యూరెన్స్ పేరుతో వసూలు చేసిన డబ్బుల లెక్క చెప్పాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.