గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి 

గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి 

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. మరీదు లక్ష్మయ్య, నాగలక్ష్మమ్మ దంపతుల రెండవ కుమారుడు రాకేష్ (18) మధిర లోనే ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే రెండు రోజుల క్రితం రాకేష్ కు జ్వరం రావడంతో స్థానికంగా ఆర్ఎంపి వద్ద చికిత్స చేయించారు. శనివారం ఉదయం గుండెలో నొప్పి వస్తుందని రాకేష్ చెప్పటంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండె సంబంధిత వ్యాధి ఉందని.. వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. 

దీంతో రాకేష్ ను కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం స్వగ్రామం తీసుకువచ్చారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి గుండె నొప్పి వస్తుందని ఒక్కసారిగా మంచంపై పడుకొని ప్రాణాలు వదిలాడు.  ఆదివారం సెలవు కావడంతో పాటు ఆర్థిక సమస్యల కారణంగా సోమవారం హైదరాబాద్ తీసుకెళ్దామని అనుకున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ అంతలోనే రాకేష్ చనిపోతాడని ఊహించలేదని కన్నీరుమున్నీరయ్యారు. రాకేష్ మృతితో బ్రాహ్మణపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సహచర విద్యార్థులు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.