దుబాయ్- ధోనీ సేన మరోసారి అదరగొట్టింది. ఐపీఎల్- సీజన్14లో చెన్నై సూపర్కింగ్స్ ఛాంపియన్ గా నిలిచింది. దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను 27 రన్స్ తేడాతో ఓడించింది. దీంతో నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది ధోనీ సేన. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే ఓపెనర్లు డుప్లెసిస్ (86), రుతురాజ్ గైక్వాడ్ (32) మంచి ఓపెనింగ్ ఇచ్చారు. గైక్వాడ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఉతప్ప (31) ఫర్వాలేదనిపించాడు. గైక్వాడ్, ఉతప్ప ఔటైనప్పటికీ డుప్లెసిస్ చెలరేగి ఆడాడు. ఫాస్ట్గా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఉతప్ప తర్వాత వచ్చిన మొయిన్ అలీ (37) దూకుడుగా ఆడాడు. దీంతో చెన్నై భారీ స్కోర్ ను సాధించింది. అయితే ఇన్నింగ్స్ చివరి బంతికి డుప్లెసిస్ ఔటయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి చెన్నై 192 రన్స్ చేసింది.
193 రన్స్ టార్గెట్ తో ఛేజింగ్కు దిగిన కోల్కతా దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (50 ), శుభ్మన్ గిల్ (51) ఫాస్ట్ గా ఆడారు. చెరో హాఫ్ సెంచరీతో మెరిశారు. వీరిద్దరి జోరు చూస్తే ఈజీగా కోల్ కతా గెలుస్తుందనుకున్నారు. అయితే వెంకటేశ్ అయ్యర్ ఔటయ్యాక కోల్ కతాకు వరుస షాకులు తగిలాయి. నితీశ్ రాణా డకౌట్ అవ్వగా.. సునీల్ నరైన్ 2 రన్స్ కే పెవిలియన్ చేరాడు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. కోల్ కతా ప్లేయర్లు చతికిలపడ్డారు. దినేశ్ కార్తిక్ (9), షకీబ్ (0), రాహుల్ త్రిపాఠి (2), మోర్గాన్ (4) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా 9 వికెట్ల నష్టానికి 165 రన్స్ మాత్రమే చేసి.. టార్గెట్ ను చేధించడంలో విఫలమైంది. దీంతో ఐపీఎల్ 2021 ఛాంపియన్ గా నిలిచిన చెన్నై.. నాలుగోసారి కప్ గెలిచింది.