
కాబూల్ : అఫ్గానిస్తాన్ పేసర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్, స్పిన్నర్ ముజీబుర్ రెహమాన్.. ఈసారి ఐపీఎల్లో ఆడటంపై డౌట్స్ నెలకొన్నాయి. ఈ ముగ్గురికి రెండేళ్ల పాటు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్వోసీ) జారీ చేయొద్దని అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) భావిస్తోంది. జాతీయ జట్టు కంటే ఇతర లీగ్కు వీళ్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే కారణంతో ఈ ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్ట్ను ఏసీబీ హోల్డ్లో పెట్టింది. వీరిపై విచారణ జరిపేందుకు అంతర్గతంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. విచారణ తర్వాత కమిటీ ఇచ్చే నివేదికను బట్టి వీళ్లపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ‘వచ్చే ఏడాది జనవరి 1న సెంట్రల్ కాంట్రాక్ట్ను వెల్లడించాల్సి ఉంది. కానీ ఈ ముగ్గురి కాంట్రాక్ట్ను హోల్డ్లో పెట్టాం. వీళ్లు నేషనల్ టీమ్ కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే వీళ్లపై విచారణ జరిపిస్తున్నాం. ఒకవేళ నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికైతే వీళ్ల కాంట్రాక్ట్ను రద్దు చేశాం’ అని ఏసీబీ పేర్కొంది. ఇటీవల జరిగిన వేలంలో నవీన్, ఫజల్, ముజీబ్ను వరుసగా లక్నో, హైదరాబాద్, కోల్కతా కొనుగోలు చేశాయి.