పరిస్థితి మారకపోతే.. ఐపీఎల్‌ రద్దే!

పరిస్థితి మారకపోతే.. ఐపీఎల్‌ రద్దే!

న్యూఢిల్లీ: ఇండియాలో మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఐపీఎల్‌ను రద్దు చేయక తప్పదని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. లీగ్‌ సజావుగా జరగాలంటే మే తొలి వారంలోనైనా ఫస్ట్‌మ్యాచ్‌ ఆడాలన్నారు. కానీ చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌లో ఉండటం, కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో లీగ్‌ను నిర్వహించడం కష్టమేనన్నారు. ‘ఇప్పటికిప్పుడు ఐపీఎల్‌ ఫ్యూచర్‌ను అంచనా వేయడం చాలా కష్టం. కనీసం ఏప్రిల్‌చివరి వరకు వేచి చూడాల్సిందే. మే ఫస్ట్‌వీక్‌లో తొలి మ్యాచ్‌ జరిగితే కొద్దిగా ఆశలు ఉంటాయి. లేదంటే రద్దు తప్పదు. సౌతాఫ్రికాలో 37 రోజుల్లోనే 59 మ్యాచ్‌లు నిర్వహించాం. దానిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లినా చాలా చర్యలు తీసుకోవాలి’ అని సదరు అధికారి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లీగ్‌ను నిర్వహించాలంటే లాజిస్టిక్స్‌చాలా కష్టమన్నారు. దేశం మొత్తం ట్రావెల్‌ చేయడం కష్టంతో కూడుకున్నదన్నారు. ‘మహారాష్ట్రలో మూడు స్టేడియాలు ఉన్నాయి. కానీ పర్మిషన్‌దొరకడం చాలా కష్టం. ఒకవేళ పర్మిషన్‌ దొరికితే అక్కడే ఆడేలా ప్లాన్స్‌మార్చుకోవచ్చు. ఫ్రెష్‌పిచ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ట్రావెల్‌ చేయడం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ టోర్నీని ఆర్గనైజ్‌ చేయడానికి ముందుకు రావాలి. ఎందుకంటే ప్రజలు, ప్లేయర్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. ఈ విషయాలన్నింటిపై గంగూలీ సమీక్ష చేస్తున్నారు’ అని బోర్డు  అఫీషియల్​ వ్యాఖ్యానించారు.