
టెహ్రాన్: న్యూక్లియర్ ప్రోగ్రామ్లు మళ్లీ ప్రారంభిస్తామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులతో ప్లాంట్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపింది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపే ప్రసక్తే లేదని ఇరాన్కు చెందిన అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ హెడ్ మొహ్మద్ ఇస్లామీ ప్రకటించారు. కొన్ని పరికరాలు మాత్రమే ధ్వంసం అయ్యాయని, వాటిని రీప్లేస్ చేస్తామని తెలిపారు. న్యూక్లియర్ ప్లాంట్లపై దాడులు జరుగుతాయని తమకు ముందే తెలుసని వివరించారు. అందుకే ప్లాంట్లలో యురేనియం ఉత్పత్తి, సేవలకు ఎలాంటి ఆటంకం కల్గకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.
ఆ ఛాన్సే లేదన్న ట్రంప్
ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక ఎప్పటికీ ప్లాంట్లను ఇరాన్ పునర్ నిర్మించుకోలేదని తెలిపారు. మళ్లీ న్యూక్లియర్ ప్లాంట్లను యాక్టివ్ చేస్తామన్న ఇరాన్ కామెంట్లను ట్రంప్ ఖండించారు. నెదర్లాండ్లో నిర్వహిస్తున్న నాటో సమిట్కు బయల్దేరే ముందు వైట్ హౌస్ బయట ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్లను నామరూపాల్లేకుండా చేశాం. వాటిని మళ్లీ యాక్టివ్ చేయడం కుదరదు. మేము దాడి చేశాక ఆ ప్రాంతమంతా ధ్వంసమైంది.
ఇక మళ్లీ న్యూక్లియర్ ప్లాంట్ల పునర్ నిర్మాణం అసాధ్యం’’ అని ట్రంప్ అన్నారు. అమెరికా మిలటరీ సామర్థ్యాన్ని కూడా ఆయన ప్రశంసించారు. బీ2 పైలెట్లు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించారని తెలిపారు. ఎవరూ చేయని సాహసం తమ పైలెట్లు చేశారని, ఇదొక హై రిస్క్ ఆపరేషన్ అని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా స్పందించారు. ఇరాన్ మళ్లీ అణ్వాయుధాలు తయారుచేయాలనుకుంటే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ మళ్లీ అణ్వాయుధాల జోలికి వెళ్లొద్దన్నారు.