టెహ్రాన్: తమపై ఏకపక్షంగా యుద్ధానికి దిగిన అమెరికాపై ఇరాన్ కసి తీర్చుకుంటుంది. అమెరికా దాడులకు ప్రతీకారంగా మిడిల్ ఈస్ట్లోని యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లు, బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ దెబ్బకు ఇప్పటి వరకు పశ్చిమాసియాలోని 13 అమెరికా సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఆ సైనిక స్థావరాలు దాదాపు నివాసయోగ్యం కానివిగా మారాయని పేర్కొంది.
దెబ్బతిన్న 13 స్థావరాలలో కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఎయిర్ఫీల్డ్ మౌలిక సదుపాయాలు, ఆయిల్ పైప్లైన్లు ధ్వంసమయ్యాయి. దీంతో అమెరికాకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇరాన్ శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయడంతో అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని నివేదిక పేర్కొంది. ఇరాన్ దళాలు గల్ఫ్లోని అమెరికా సైనిక, ఇంధన ఆస్తులపై అత్యంత కచ్చితమైన క్షిపణి, డ్రోన్ దాడులు చేశాయి.
ఇరాన్ దాడుల తీవ్రత తట్టుకోలేక స్థావరాల్లోని అమెరికా సైనికులు హోటళ్లు, కార్యాలయాలకు దుకాణం సర్దేయాల్సిన పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. ఇరాన్ నిరంతర దాడులు అమెరికా సైన్యంలోని కొన్ని భాగాలను రిమోట్ వార్ఫేర్ స్థితిలోకి నెట్టివేసిందని పలువురు సీనియర్ అధికారులు తెలిపారు. ఈ పరిణామం గల్ఫ్లో అమెరికా సైనిక మోహరింపుల దీర్ఘకాలిక మనుగడపైనా తీవ్ర ప్రభావం చూపనుంది.
కాగా.. 2026, ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా అమెరికాపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఇరాన్ అగ్ర నాయకత్వం చనిపోయింది. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇందులో భాగంగానే గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడింది.
