కూకట్పల్లి, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూకట్పల్లిలో డబుల్ బెడ్రూమ్ఇండ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. మంగళవారం కూకట్పల్లిలోని తన ఆఫీస్లో విలేకరులతో మాట్లాడారు. లాటరీ విధానాన్ని పాటించకుండా అర్హత లేని వారికి, మంత్రులు, అధికారుల అనుచరులకు ఇష్టానుసారంగా 104 ఇండ్లు కేటాయించారన్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన మహిళకు ఆధార్ మార్చి మరీ ఇల్లు కేటాయించారని ఆధారాలు చూపారు. దరఖాస్తు చేయని వారికి కూడా కేటాయింపులు జరిగాయని, 800 మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు వసూలు చేశారని తెలిపారు. దీనిపై మేడ్చల్ కలెక్టర్ స్పందించి విజిలెన్స్ విచారణ జరపాలని కోరారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
