ఏసీబీ కస్టడీకి ఇరిగేషన్ ఈఈ శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఐదు రోజుల పాటు విచారించనున్న అధికారులు

ఏసీబీ కస్టడీకి ఇరిగేషన్ ఈఈ శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఐదు రోజుల పాటు విచారించనున్న అధికారులు

హైదరాబాద్‌‌, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్‌‌ ఈఈ నూనె శ్రీధర్‌‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం కస్టడీకి తీసుకున్నారు.  కాళేశ్వరం  ప్రాజెక్ట్‌‌ నిర్మాణంలోని గాయత్రి పంప్‌‌హౌస్‌‌ ఇన్​చార్జిగా శ్రీధర్ కీలక బాధ్యతలు నిర్వహించారు. అక్రమాస్తుల ఆరోపణలు రావడంతో ఇటీవల ఆయనకు చెందిన నివాసాలు, ఆఫీసులపై  దాడులు చేపట్టిన ఏసీబీ రూ.200 కోట్ల వరకు అక్రమాస్తులను గుర్తించింది. 

కోర్టు అనుమతితో శ్రీధర్​ను చంచల్‌‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌‌లోని ఏసీబీ హెడ్‌‌క్వార్టర్స్‌‌కు అధికారులు తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించి, తిరిగి చంచల్‌‌గూడ  జైలుకు తరలించారు. మళ్లీ శనివారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. మంగళవారం వరకు ఐదు రోజులపాటు శ్రీధర్‌‌‌‌ను విచారించనున్నారు. ‌‌ఆయన ‌‌‌‌ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ నెల 11న శ్రీధర్‌‌‌‌ను ఏసీబీ అరెస్ట్‌‌ చేసింది.

జీతభత్యాల లెక్కలు తీస్తున్న ఏసీబీ

మొదటిరోజు విచారణలో భాగంగా శ్రీధర్‌‌‌‌కు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఆయన సంపాదన, అంతకుముందు ఆర్థిక పరిస్థితులతో కూడిన స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్ చేసినట్లు తెలిసింది. కుటుంబ నేపథ్యంతోపాటు వారసత్వంగా వచ్చిన ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. 

శ్రీధర్‌‌‌‌జీతభత్యాలు, నెలవారీ ఖర్చులు, స్థిర చరాస్తులకు చెందిన డాక్యుమెంట్లతో ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఉద్యోగంలో చేరిన నాటి నుంచి గత నెల వరకు ఎంత జీతం తీసుకున్నారు? ప్రతినెలా ఖర్చులు పోను ఎంత మిగులు ఉంటుందనే కోణంలో శ్రీధర్‌‌‌‌ స్టేట్‌‌మెంట్‌‌ రికార్డు చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే   బ్యాంక్ స్టేట్‌‌మెంట్లను ఏసీబీ అధికారులు సేకరించారు. రెండో రోజు కస్టడీలో భాగంగా శనివారం కూడా శ్రీధర్​ను తమ కస్టడీ తీసుకుని ప్రశ్నించనున్నారు.