
టెహ్రాన్: కాల్పుల విరమణను ఉల్లంఘించి ఇజ్రాయెల్పై ఇరాన్- దాడులకు తెగబడింది. సీజ్ఫైర్జరిగిన గంటలోనే టెల్అవీవ్ లక్ష్యంగా మిసైల్స్ వర్షం కురిపించిందని, దీంతో 60 నిమిషాల వ్యవధిలోనే నాలుగు ఎయిర్ సైరన్లు మోగాయని ఇజ్రాయెల్ వెల్లడించింది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. దక్షిణ ఇజ్రాయెల్ నగరమైన బీర్ షెవాలో మిసైల్దాడి జరగ్గా.. ఓ కాంప్లెక్స్ పూర్తిగా ధ్వంసమైంది. ఇక్కడ ముగ్గురు మృతిచెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
కాంప్లెక్స్ బయట కార్లు, చెట్లు కాలిపోయినట్టు వీడియోలో కనిపించింది. శిథిలాలనుంచి ఐదుగురిని అధికారులు బయటకు తీశారు. కాగా, ఇరాన్ తమపై 6 క్షిపణులతో దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ధ్రువీకరించింది. 48 గంటల్లో ఇరాన్ చేసిన అతిపెద్ద క్షిపణి దాడుల్లో ఇది ఒకటని పేర్కొన్నది. కాల్పుల విరమణను ఇరాన్ ఉల్లంఘించిందని, దీనికి గట్టిగా బదులిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్పై గట్టిగా స్పందించాలని తాను ఐడీఎఫ్కు ఆదేశించానని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ చెప్పేవన్నీ అబద్ధాలే
తాము కాల్పుల విరమణకు అంగీకరించినా ఇజ్రాయెల్ను నమ్మబోమని ఇరాన్ ప్రకటించింది. తాము సీజ్ఫైర్ను ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని పేర్కొన్నది. అమెరికా–-ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణను తాము ఉల్లంఘించలేదని వెల్లడించింది. ఇజ్రాయెల్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని, తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్పైనే ఉన్నాయని ఇరాన్ కౌంటర్ ఇచ్చింది.
అయితే, తాము ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోలేదని, ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తామూ ఆపేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మంగళవారం ఉదయం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే.. ఇజ్రాయెల్పై ఇరాన్ సైనిక కార్యకలాపాలు ముగిశాయని అర్థం వచ్చేలా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తమ సాయుధ దళాలు చివరివరకు శక్తిమంతమైన పోరాటం కొనసాగించాయని చెబుతూ.. కాల్పుల విరమణకు సిద్ధమేనన్న సంకేతాలిచ్చారు.