గోబెల్స్ సిగ్గుపడేలా చంద్రబాబు అబద్ధాలు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

గోబెల్స్ సిగ్గుపడేలా చంద్రబాబు అబద్ధాలు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : ఆంధ్రా మహానాడులో తెలంగాణ ముచ్చటెందుకని ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. గోబెల్స్ కూడా సిగ్గుపడేలా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. శుక్రవారం అమెరికాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగదీశ్​రెడ్డి మాట్లాడిన వీడియో విడుదల చేశారు. 2004తోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసిందని చెప్పారు. హైదరాబాద్‌ అభివృద్ధి ఆయన వల్లే జరిగిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2004లో సమైక్యాంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.26 వేల లోపేనని స్పష్టం చేశారు. 

2014 నుంచి ఆంధ్రలో మీ ఐదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఒక్కసారి గుర్తుచేసుకోవాలని చెప్పారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధితో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో తెలంగాణ తలసరి ఆదయం రూ.1.12 లక్షలు ఉంటే.. కేసీఆర్ పాలనలో రూ.3.70 లక్షలకు చేరిందన్నారు. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయ రూ.2.50 లక్షలు మాత్రమేనని వెల్లడించారు. నిజంగా మీ పరిపాలన గొప్పదైతే ఏపీ ఆదాయం ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు