
కుస్తాపూర్కు కాశ్మీర్ పోలీసుల రాక
రైతు లింగన్నను విచారణ
ఎవిడెన్సులు లేవని విడిచిపెట్టిన అధికారులు
జగిత్యాల/జగిత్యాల క్రైం, వెలుగు: టెర్రర్ లింక్స్ వార్తలతో రాష్ర్టంలోని జగిత్యాల జిల్లా ఉలిక్కిపడింది. దేశద్రోహం కేసులో అరెస్టయిన వ్యక్తికి డబ్బు పంపాడన్న ఆరోపణలతో కాశ్మీర్ పోలీసులు లింగన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా విచారించారు. చివరికి ఎలాంటి ఆధారాలు లేవని విడిచిపెట్టారు. పోలీసులు, విశ్వసనీయ సమాచారం మేరకు… కాశ్మీర్లోని పోవాల్కు చెందిన రాకేశ్.. ఆర్మీలో పని చేసేవాడు. 2019లో ఫేస్బుక్ద్వారా అనిత జట్టె పేరుతో ఓ యువతి పరిచయమైంది. ఆమె అడిగిందని ఆర్మీ క్యాంప్, ట్రాఫిక్ఏరియాలు, జనాలు ఎక్కువగా ఉన్న ప్లేసులు, బోర్డర్ప్రాంతాలు, సినిమా టాకీస్ ఫొటోలను తీసి పంపాడు. ఈ క్రమంలో అనిత పేరుతో పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులు పరిచయం పెంచుకున్నట్లు గుర్తించిన కాశ్మీర్ పోలీసులు.. రాకేశ్పై జనవరి 5న కేసు నమోదు చేసి జైలుకు పంపారు. రాకేశ్ అకౌంట్కు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన సరిగెల లింగన్న మనీ ట్రాన్సాక్షన్ చేసినట్లు విచారణలో గుర్తించారు. సాగు చేసుకుంటూ బతుకుతున్న లింగన్నను సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని మంగళవారం రాత్రి వరకు కాశ్మీర్ పోలీసులు విచారణ జరిపారు.
మూడు సార్లు పంపాడు..
రాకేశ్ అకౌంట్కు జనవరి 15న 6 వేలు, ఫిబ్రవరి 5న 5వేలు, ఫిబ్రవరి 20న 4 వేలు లింగన్న పంపినట్లుపోలీసులు గుర్తించారు. తన బావ శ్రీనివాస్ 20 ఏళ్లుగా దుబాయ్లో పని చేస్తున్నాడని, అతడు రాకేశ్కు డబ్బు పంపాలని చెప్పడంతోనే ట్రాన్స్ఫర్ చేశానని లింగన్న చెప్పినట్లు సమాచారం. బావ శ్రీనివాస్కు పక్క షాపులో పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి పని చేస్తున్నాడని, అతడు అడగడంతోనే డబ్పు పంపమని శ్రీనివాస్ తనకు చెప్పాడని లింగన్న పోలీసులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల కిందట జగిత్యాలలో మకాం వేసిన టెర్రరిస్టు అజాం ఘోరీని ఎన్ కౌంటర్ చేయడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్లీ ఇప్పుడు కాశ్మీర్ పోలీసులు జిల్లాకు వచ్చి విచారణ చేపట్టడం కలకలం రేపింది.
కోర్టు పర్మిషన్ ఇవ్వలే
లింగన్న ను విచారణ జరిపిన కాశ్మీర్ పోలీసులు.. మెట్పల్లి మెజిస్ట్రేట్ ముందర హాజరు పరిచారు. విచారణ కోసం జమ్మూకాశ్మీర్ కు తీసుకు వెల్లేందుకు అనుమతి కోరగా.. కోర్టు నిరాకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.